'కుంతియా, ఆజాద్‌ల ఆరోపణలు అసత్యం'

7 Mar, 2020 14:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్‌ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి విషయంలో ప్రభుత్వంపై, పోలీసులపై కాంగ్రెస్‌ నేతలు కుంతియా, ఆజాద్‌లు చేసిన ఆరోపణలు అసత్యమని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పేర్కొన్నారు. గోపన్‌పల్లి భూ ఆక్రమణలు కప్పిపుచ్చుకోవడానికే రేవంత్‌ రెడ్డి కావాలనే అరెస్టు అయి జైలుకు వెళ్లాడని తెలిపారు. ఎలాంటి పర్మిషన్‌ తీసుకోకుండా డ్రోన్‌లను ఎగిరేయడం చట్ట విరుద్ధం అన్నారు. చట్టాలు తెలిసిన వారు ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారన్నారు.

ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు శోచనీయమని, ప్రతిపక్షాలు పసలేని పక్షాలుగా తయారయ్యాయని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తున్నప్పటికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. 'అభివృద్ధి జరగలేదంటున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలను అచ్చంపేట నియోజకవర్గానికి ఆహ్వానిస్తున్నా. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం. అసెంబ్లీలో ఒక నిర్మణాత్మకమైన చర్చకు తావివ్వాలని ప్రతిపక్షాలను నేను ఈ సందర్భంగా కోరుతున్నా' అంటూ బాలరాజు మీడియాకు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు