స్లాగ్‌ లారీలను కట్టడి చేయండి

28 Jul, 2018 07:58 IST|Sakshi
మాట్లాడుతున్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి

నంద్యాల (కర్నూలు): పాణ్యం రైల్వే స్టేషన్‌ నుంచి లారీల్లో స్లాగ్‌ను లోడ్‌కు మించి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ఫ్యాక్టరీకి  తీసుకొని వెళ్తున్నా.. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని శోభా ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లారీల్లో ఎక్కువ స్లాగ్‌ను తీసుకొని వెళ్లడంతో అది రోడ్డుమీద పడుతోందన్నారు. స్లాగ్‌ ఒక్కసారి కంట్లో పడితే కంటి చూపు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. అధిక లోడుతో   వెళితే సీజ్‌ చేయాలన్నారు. నంద్యాల సిటీకేబుల్‌(డిజిటల్‌ టీవీ కమ్యూనికేషన్‌) యాజమాన్యం కేబుల్‌ వ్యవస్థ  అంతా తమ చేతుల్లోనే ఉంచుకోవాలని చూస్తోందన్నారు.  దీని కోసం ఆపరేటర్లను భయపెట్టడం, వారు తగ్గకపోతే కనెక్షన్‌  తక్కువ ధరకే ఇచ్చి వారిని దెబ్బతీయడం చేస్తోందన్నారు.

గడివేముల మండలంలో కొందరు ఆపరేటర్లు సిటీకేబుల్‌ నుంచి పక్కకు వచ్చి సొంతంగా కేబుల్‌ ఏర్పాటు చేసుకుంటే వారిని దెబ్బతీయడానికి నెలకు రూ.130 ఉన్న కనెక్షన్‌ను ఒక్క గడివేముల మండలంలో మాత్రం రూ.50కే ఇస్తున్నారన్నారు. గడివేముల మండలం నుంచి ఇన్ని సంవత్సరాలు కోట్లాది రూపాయలు ఆదాయం తీసుకున్నారని, ఆ ఆదాయంతో రూ.50కి కనెక్షన్‌ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అయితే నంద్యాల పట్టణంలో కూడా రూ.50కే కనెక్షన్‌ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సిటీకేబుల్‌ యజామాన్యం ప్రజలను, ఆపరేటర్లను ఇబ్బందులు పెడితే త్వరలోనే తాను నంద్యాలలో కేబుల్‌టీవీ ఏర్పాటు చేస్తానన్నారు. తాను ఎన్నడు వ్యాపార విషయాల్లో జోక్యం చేసుకోలేదని, ఎవరి వ్యాపారం వారు చేసుకుంటారని, అయితే స్వచ్ఛం దంగా పని చేసుకుంటున్న గడివేముల ఆపరేటర్లను భయపెట్టడం తగదన్నారు. కార్యక్రమంలో పాణ్యం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ వైస్‌ చైర్మన్‌ ఆర్‌బీ చంద్రశేఖర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, బాలహుసేని, బిలకలగూడూరు చంద్రశేఖర్‌రెడ్డి, ఆపరేటర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు