వైఎస్సార్‌సీపీలోకి కాటసాని రాంభూపాల్‌రెడ్డి

30 Apr, 2018 02:11 IST|Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో తరలివచ్చి కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కనుమూరు సమీపంలో పాదయాత్ర సాగిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కాటసాని, ఆయన కుటుంబ సభ్యులు, ఆయనతో పాటు వచ్చిన ఇతర నేతలకు వైఎస్‌ జగన్‌.. కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ‘భూపాలన్న, ఆయనతోపాటు వచ్చిన నేతలు, కార్యకర్తలందరూ ఇక నుంచి వైఎస్సార్‌ కుటుంబ సభ్యులు’ అని పేర్కొన్నారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరిందన్నారు. మళ్లీ అలాంటి సంక్షేమ పాలన వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. జగన్‌ను సీఎం చేయడమే అందరి కర్తవ్యం కావాలన్నారు.  

మరిన్ని వార్తలు