జనగామ ప్రాంతం పోరాటాల పురిటిగడ్డ : కేసీఆర్‌

23 Nov, 2018 17:12 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పెత్తనం అవసరమా అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ప్రశ్నించారు. శుక్రవారం సూర్యాపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఏపీలో చంద్రబాబుకు డిపాజిట్లు రావని చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఎవరు మేలు చేస్తారో ఆలోచించి వారికే ఓటు వెయ్యండని ప్రజలకు సూచించారు. ఎన్నికలపై ప్రతి గ్రామంలో చర్చ జరగాలన్నారు. నాలుగేళ్లలో ఏం చేశామో  ప్రజలందరికి తెలుసని చెప్పారు.

తెలంగాణ వస్తే చీకటవుతుందని బెదిరించారని, కానీ దేశంలో 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని నొక్కిఒక్కానించారు. యాదవులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు. యాదవులకు తాము గొర్రెలు ఎందుకు ఇచ్చామో కాంగ్రెస్‌ నేతలకు అర్థం కాలేదన్నారు. లక్షా 70 వేల గొర్రెలను పంపిణీ చేస్తే వాటికి 40 లక్షల గొర్రె పిల్లలు పుట్టాయని వ్యాఖ్యానించారు. యాదవుల అభివృద్ధికి కృషి చేసింది టీఆర్‌ఎస్‌ సర్కారేనన్నారు.

గుంట భూమున్న రైతు ప్రమాదవశాత్తు చనిపోతే 5లక్షల రూపాయల భీమా కల్పిస్తామన్నారు. వెయ్యి రూపాయల పింఛన్‌ను రూ.2016 చేస్తామని చెప్పారు. వికలాంగులకు రూ.1500 ఉన్న పింఛన్‌ను రూ.3016 చేస్తామని తెలిపారు. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇస్తామన్నారు. రైతు బంధు కింద ఎకరానికి రూ.5వేలు ఇస్తామని పేర్కొన్నారు.

జనగామ ప్రాంతం పోరాటాల పురిటిగడ్డ
జనగామ : జనగామ ప్రాంతం పోరాటాల పురిటిగడ్డ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన జనగామలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. జనగామ ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎవరు ఏం చేశారో తెలుసన్నారు. ప్రపంచంలోని పది అత్యుత్తమ పథకాల్లో రైతు బంధు పథకం ఒకటిని చెప్పారు. ఆ పథకం ఐక్కరాజ్య సమితి అవార్డు తీసుకోబోతూందని తెలిపారు. కేంద్రంలో నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ ప్రభుత్వాలు రావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు