హైదరాబాద్: త్వరలోనే దేశ రాజకీయాల్లో సమూల మార్పులు చూస్తారని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అతి పెద్ద మెజారిటీతో మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తరుణంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడారు. దేశ రాజకీయాల్లో మార్పులు చూడబోతున్నారన్న కేసీఆర్.. ఏం చేయబోతామన్నది త్వరలో చేసి చూపిస్తామన్నారు. దేశంలో 15 కోట్ల మంది రైతులు ఉంటే, వారంతా అన్నమో రామచంద్రా అంటూ ఉన్నారని, ఈ దేశంలో 70వేల టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ 30 వేల టీఎంసీల నీరు మాత్రమే వాడుకోవడం నిజంగా సిగ్గుచేటన్నారు.పార్టీ గెలిచిందని శ్రేణులు ఎవ్వరూ కూడా అతిగా వ్యవహరించవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. ముఖ్యంగా వినయం, విధేయత అనేది అవసరమన్నారు. ఇది సకల జనులు తమకు అందించిన విజయంగా కేసీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, గిరిజనులు, దళితులతో పాటు ప్రతీ ఒక్కరూ తమ భారీ విజయంలో సహకరించారన్నారు.
‘అంతిమ తీర్పు ప్రజలు అప్పగించారు కాబట్టి.. ఆ సమయాన్ని ప్రజా సేవచేయడానికి కేటాయించాలి. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎన్ని ఎదురుదాడులకు దిగినప్పటికీ అవన్నీ గతం. నేను ప్రజలకు చెప్పిందొకటే టీఆర్ఎస్ వస్తే కాళేశ్వరం వస్తది.. కూటమిని గెలిపిస్తే శనిశ్వరం వస్తది అని చెప్పిన. ప్రజలు మాకు కాళేశ్వరమే కావాలంటూ తీర్పునిచ్చారు. తెలంగాణలో నిశ్చితంగా ధనిక రైతాంగం ఉందనేవిధంగా పనిచేస్తాం. గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూములు కోసం కష్టపడుతున్నారు. ఇందుకు పరిష్కారం వచ్చే దిశగా ప్రయత్నిస్తా. కులవృత్తులు అన్నీ కుదుటపడే విధంగా చర్యలు చేపడతాం. యువతలో నిరుద్యోగ సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఇది యావత్ దేశంలో ఉన్న సమస్యే.. కానీ యువతకు సాధ్యమైనన్ని ఎక్కువ ఉద్యోగాలు వచ్చేవిధంగా ముందుకు సాగుతాం. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ను వేస్తాం. ప్రభుత్వ ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో ప్రజల సంపూర్ణ ఆరోగ్యం దిశగా కృషి చేస్తాం. దళితులు, గిరిజనుల పేదరికాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటాం. ఎవరి సమస్య అయినా సమస్యే కాబట్టి.. ప్రజాసమస్యలే కేంద్ర బిందువుగా పనిచేస్తాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే..