పథకాలు కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటేయ్యాలి: కేసీఆర్‌

26 Nov, 2018 17:04 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌/జగిత్యాల : సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేయ్యాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. సోమవారం కరీంనగర్‌, జగిత్యాల నియోజకవర్లాల్లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించబోతోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. నాలుగేళ్ల తమ పాలనలో సంపద పెంచి పేదలకు పంచామని, 17.17 శాతం అభివృద్ధితో తెలంగాణ.. దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అదే స్థాయిలో జరగాలన్నా.. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా.. టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. అన్ని ఆలోచించి ఎవరూ గెలిస్తే న్యాయం జరుగుతుందో వారిని గెలిపించుకోవాలన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేశారని, అలాంటి బాబుతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ వలసాధిపత్యాన్ని రుద్దే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటేయ్యాలని సూచించారు.  పోటీ కేవలం టీడీపీ - కాంగ్రెస్ కూటమి, టీఆర్‌ఎస్‌కు మాత్రమేనని, మిగతా వాళ్ల గురించి అనవసరం లేదన్నారు. టీడీపీ-కాంగ్రెస్‌లు కలిపి 58 ఏండ్లు పాలించాయని, వారి పాలనలో కరెంట్ ఎట్లా ఉందో. ఇప్పుడు ఎట్ల ఉందో ఆలోచించాలన్నారు. మిషన్‌ భగీరథ మరో నెలరోజుల్లో  పూర్తి కాబోతుందని, రాబోయే రోజుల్లో విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తామన్నారు. జగిత్యా, కరీంనగర్‌ టీఆర్‌ఎస్ అభ్యర్థులు సంజయ్ కుమార్‌, గంగుల కమలాకర్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

>
మరిన్ని వార్తలు