ఏపీ‘హోదా’కు సంపూర్ణ సహకారం

9 Apr, 2019 01:26 IST|Sakshi

పోలవరం నిర్మాణాన్ని మేమెన్నడూ అడ్డుకోలేదు: ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఏపీ ప్రత్యేక హోదా సాధనకు టీఆర్‌ఎస్‌ మద్దతు

వికారాబాద్‌ సభలో స్పష్టం చేసిన సీఎం కేసీఆర్‌

ఏపీలో జగన్‌ గెలవడం.. బాబు ఓడటం ఖాయమని జోస్యం

పార్లమెంటు ప్రచారంలో తొలిసారి బాబుపై తీవ్ర విమర్శలు

ఏపీ ప్రజలు మంచోళ్లు, వాళ్లతో పంచాయితీ లేదు

జూన్‌ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం.. సీఎం వెల్లడి

చంద్రబాబు నన్ను రోజూ తిడుతుండు. హైదరాబాద్‌కు శాపాలు పెడుతుండు. నిన్న, మొన్న అయితే ఇంకా దారుణంగా మాట్లాడిండు. అసలు సంగతేదంటే.. చంద్రబాబు డిపాజిట్‌ దక్కకుండా దారుణంగా ఓడిపోతుండు. ఆయన పరిస్థితి ఏం బాగోలేదు. చంద్రబాబు కహానీ ఖతం అయిపోయింది. నా దగ్గర లేటెస్టు సర్వే రిపోర్టులు ఉన్నాయి
– వికారాబాద్‌ సభలో సీఎం

సాక్షి, వికారాబాద్‌: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ఏటా గోదావరి జలాలు సముద్రం పాలయ్యే కన్నా.. ఆంధ్రా ప్రజలు వాడుకుంటే తమకేం ఇబ్బంది లేదని తెలిపారు. పోలవరం నిర్మాణానికి తాము ఏనాడూ అడ్డు తగల్లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధన కోసం టీఆర్‌ఎస్‌ ఎంపీలు సహకరిస్తారని ప్రకటించారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ బ్రహ్మాండంగా గెలుస్తారని తెలిపారు. చంద్రబాబు డిపాజిట్‌ రాకుండా దారుణంగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఓటమిని జీర్ణించుకోలేకే బాబు రోజూ తనను తిడుతున్నాడని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలతో తనకు, తెలంగాణ ప్రజలకు ఎలాంటి పంచాయితీ లేదన్నారు. బాబు వంటి కొంత మంది నాయకులతోనే తమకు కిరికిరి ఉందన్నారు.

లక్షలాది మందిలో చెబుతున్నా..
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాకు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తుందని వైఎస్‌ జగన్‌ చెబితే.. కేసీఆర్‌ నీకు చెవిలో వచ్చి చెప్పిండా అని చంద్రబాబు అంటున్నాడన్నారు. ‘చంద్రబాబు.. మేం ఏదీ చెవిలో చెప్పం.. లక్షలాది మంది సభా వేదికగా, తెలంగాణ గడ్డ నుంచి చెబుతున్నా.. నీలాంటి చీకటి పనులు మాకు రావు. నీలా గోతులు తీయం. కుట్రలు చేయటమూ మాకు రాదు. మేం బాగుండాలి. ఇతరులు బాగుండాలని కోరుకుంటాం’ అని కేసీఆర్‌ తెలిపారు. ‘రెండు విషయాలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మేం లోక్‌సభ,

రాజ్యసభలో మాట్లాడాం. ప్రత్యేక హోదా విషయంలో అదే స్టాండు మీద ఉన్నాం’అని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్, ఒక సీటు మజ్లిస్‌ గెలవడం ఖాయమన్నారు. ఏపీలో జగన్‌ బ్రహ్మాండగా గెలుస్తారని.. ఇద్దరికీ కలిపి 35 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తేవటనికి తెలంగాణ ఎంపీలు, టీఆర్‌ఎస్‌ సపోర్టు చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. ‘చంద్రబాబూ.. నీలాంటి సన్నాసి ఎవ్వరూ ఉండరు. నీలాంటి దరిద్రపు బుద్ధి మాకు లేదు. నీలాగా మేం అల్పులం కాదు. నీకు తెలివిలేదు. నాకు తెలివి ఉంది. నాకు లెక్కలు తెలుసు. నాది ఉదారస్వభావం’అని సీఎం పేర్కొన్నారు.  
 
మేం కోరేది మా వాటా మాత్రమే
గోదావరిలో తెలంగాణకు 1,000 టీఎంసీల కేటాయింపు ఉందని వాటిని కచ్చితంగా తీసుకుని తీరతామని సీఎం స్పష్టంచేశారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి చెప్పామన్నారు. తెలంగాణను ముంచుతామంటే పోలవరం వద్దన్నామే కానీ పోలవరం ప్రాజెక్టును అడ్డుకోలేదన్నారు. పోలవరం కట్టడానికి సంపూర్ణ సహకారం ఇస్తామని ప్రకటించారు. గోదావరి జలాలు వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సంపూర్తిగా వినియోగించుకున్న తర్వాత కూడా.. 2,600 టీఎంసీ గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయన్నారు. గోదావరి నీళ్లు సముద్రం పాలయ్యేకంటే, ఆంధ్రవాళ్లు వాడుకుంటే తమకేమీ ఇబ్బంది లేదన్నారు. ‘మేం కోరేది మా వాటా మాకు రావాలే.. మా పొలాలకు నీరు పారాలే. మాతో పాటు మీరు బతకాలని కోరుతున్నాం’అని కేసీఆర్‌అన్నారు.  
 
కొత్త రెవెన్యూ చట్టం
జూన్‌ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. రైతులు లంచాలు ఇచ్చే బాధలు పోయేందుకే కొత్త చట్టాన్ని తెస్తున్నామన్నారు. రైతుల బా«ధలు నాకు పూర్తిగా తెలుసు. ఇకపై రైతులు ఎవ్వరికి లంచాలు ఇవ్వవద్దని, రెండు నెలలు ఒపికపట్టాలని కోరారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీల్లో నిత్యం ప్రజలు దోపిడీకి గురయ్యే పరిస్థితి ఉందన్నారు. కొంతమంది అధికారులు దుర్మార్గంగా లంచం కోసం పట్టి పీడిస్తున్నారని కేసీఆర్‌ తెలిపారు. తాను అందరు అధికారులను తప్పుపట్టడంలేదని, లంచం తీసుకునే వారిని మాత్రమే తప్పుపడుతున్నట్లు చెప్పారు. ఇతనకు ఇటీవల డా.శ్రీనివాస్‌ అనే వ్యక్తి భువనగిరి నుంచి ఎస్సెమ్మెస్‌ చేసినట్లు కేసీఆర్‌ చెప్పారు. ఆ ఎస్‌ఎంఎస్‌లో తాను రెండు ప్రభుత్వ కార్యాలయాలకు పనికోసం వెళ్లగా అక్కడ రెండు చోట్లా రూ.30వేల చొప్పున తనకు లంచం అడిగారని.. లంచం ఇవ్వక తప్పలేదన్నారు.

‘కేసీఆర్‌ మీరు పెద్ద పాపులర్‌ లీడర్‌. మీరు కూడా లంచంను నివారించలేరా’అని రాశారన్నారు. ఎసెమ్మెస్‌ చదవి సిగ్గుతో తాను తలవంచుకున్నానని.. అదే రోజు అధికారులతో మాట్లాడి అవినీతి.. లంచాల నిర్మూలించాలని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలు కొద్దిరోజులు అగాలని మంచి రోజులొస్తాయని భరోసా ఇచ్చారు. మే నుంచి పింఛన్‌ మొత్తాలను పెంచుతున్నామని, బడ్జెట్‌లో డబ్బులు పెట్టామని కేసీఆర్‌ చెప్పారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సొంతజాగాలో డబుల్‌బెడ్‌రూమ్‌ నిర్మించుకుంటే ఆర్థిక సహాయం చేస్తామన్నారు. వికారాబాద్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వికారాబాద్‌ను చార్మినార్‌ జోన్‌లో కలుపుతామని హామీ ఇచ్చారు. వికారాబాద్‌కు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు ఇస్తామని సీఎం తెలిపారు.
 
కేంద్రంలో సంకీర్ణ సర్కార్‌!
భారతదేశం చాలా విషయాల్లో వెనకబడిందని కేసీఆర్‌ అన్నారు. కేంద్రంలో గుణాత్మక మార్పు రావాలని, అది టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని తెలిపారు. కేంద్రంలో సంకీర్ణ సర్కార్‌ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. బీజేపీకి 150, కాంగ్రెస్‌కు వందలోపు ఎంపీ సీట్లు వస్తాయని, కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా 16 మంది ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని లాంటి నేతలు హిందువులు, మైనార్టీలను విభజించి మాట్లాడటం సరికాదన్నారు. దేశాన్ని విభజించి పాలించాలనే కుటిలనీతి సరికాదన్నారు. దేశం సంపద పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అందరికి ఉద్యోగాలు, ఉపాధి, విద్య, వైద్యం దొరకాలన్నారు. దేశ ప్రజలందరికి మేలు చేసే ప్రయత్నం మీ బిడ్డగా నేను చేస్తానని కేసీఆర్‌ అన్నారు. బహిరంగసభలో టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కే. కేశవరావు, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, ఎమెల్సీ కర్నె ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ చైర్మన్‌ బొంతు రామ్మోహన్, టీఆర్‌ఎస్‌ నేతలు తీగల కృష్ణారెడ్డి, కార్తీక్‌రెడ్డి, బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు