టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేతగా కేకే

13 Jun, 2019 17:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా డాక్టర్‌ కె. కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ నేతగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు ఎన్నికయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ నాయకుడిగా కేశవరావు వ్యవహరించనున్నారు. త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ భేటీలో చర్చించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

మరోవైపు ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగనున్న 5వ నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం ఆహ్వానించింది. నీతి ఆయోగ్‌ సమావేశం ముగిసిన అనంతరం శుక్రవారం రాత్రి కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ రానున్నారు. కాగా, ఈ నెల 20న ఢిల్లీలో జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థికమంత్రి హోదాలో హాజరయ్యేందుకు మరోసారి ఢిల్లీ వెళ్లే అవకాశముంది. 

మరిన్ని వార్తలు