జేసీ సోదరులు.. తోడుదొంగలు..

5 Feb, 2020 07:49 IST|Sakshi
త్రిశూల్‌ అక్రమ మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి

అనుమతుల్లేకుండా రూ.300 కోట్ల విలువైన ఖనిజం దోపిడీ

త్రిశూల్‌ కంపెనీ ఓ బినామీ  

సమాజానికి మాజీ ఎంపీ జేసీ ఓ వైరస్‌  

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

తాడిపత్రి: ‘‘జేసీ సోదరులు తోడు దొంగలు. త్రిశూల్‌ ఓ బినామీ కంపెనీ. మాజీ ఎంపీ జేసీ తన ఇంట్లోని వంట మనిషి, డ్రైవర్, చికెన్‌ షాపు యజమానుల పేర్లతో ఈ కంపెనీని సృష్టించి రూ.300కోట్లకు పైగా విలువ చేసే ఖనిజాన్ని అక్రమంగా దోచుకున్నాడు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వ్యవహరించడమే కాకుండా లీజులను పొడిగిస్తూ పరోక్షంగా మద్దతు పలికారు.’’ అని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి త్రిశూల్‌ కంపెనీ అక్రమ మైనింగ్‌ తీరుతెన్నులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ఓ పరిశ్రమ నెలకొల్పితే కానీ ఖనిజాన్ని తవ్వుకునేందుకు వీలు లేదన్నారు. అలాంటిది సేల్స్‌ ట్యాక్స్‌ నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది టన్నుల ఖనిజాన్ని కొల్లగొట్టారన్నారు. కంపెనీలో బినామీలుగా ఉన్న వ్యక్తులకు 5శాతం వాటా కల్పించి, జేసీ సోదరులు తమ వద్ద 95 శాతం వాటా ఉంచుకుని ఈ బాగోతాన్ని నడిపించారన్నారు. మాజీ ఎంపీ జేసీ వియ్యంకుడు వేణుగోపాల్‌రెడ్డి తనకు త్రిశూల్‌తో ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించడమే లీజు రద్దుకు కారణమన్నారు. అయితే ఇప్పటికీ కోర్టుకు వెళ్తానని జేసీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. సమాజానికి ఆయన ఓ వైరస్‌ అని, ఈ సోదరుల వద్ద జిల్లాలో వీరి వెంట నడుస్తున్న నేతలందరికీ అది వ్యాప్తి చెందుతోందన్నారు. ఇతరుల కడుపుకొట్టి దోపిడీ చేయడం జేసీ సోదరులకే చెల్లిందన్నారు. వీరి అవినీతి సీరియల్‌ను తలపిస్తోందన్నారు. ట్రాన్స్‌పోర్టులో కూడా అనేక కుంభకోణాలు ఉన్నాయన్నారు. వీటన్నింటిపైనా సీబీఐ విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

మరిన్ని వార్తలు