ఎకరాకు రూ.10వేల బోనస్‌

16 Oct, 2018 01:40 IST|Sakshi

గ్రామాల్లో సచివాలయాలు టీడీపీ మేనిఫెస్టోలో కీలకాంశాలు..

దసరా తర్వాత పూర్తిస్థాయిలో విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రైతులందరికీ ఆర్థిక భరోసా ఇచ్చేందుకు గాను ఏటా ఎకరాకు రూ.10వేల బోనస్‌ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరచనుంది. రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా లేనందునే టీఆర్‌ఎస్‌ పాలనలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందనీ, రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

సోమవారం పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ టి.దేవేందర్‌గౌడ్‌ అధ్యక్షతన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో కమిటీ మూడో సమావేశం జరిగింది. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై నేతలు చర్చించి కొన్ని నిర్ణయాలను కూడా తీసుకున్నారు. నిధులు, విధులు, బాధ్యతలతో పంచాయతీరాజ్‌ వ్యవస్థను గ్రామసచివాలయాలుగా పటిష్టం చేస్తామనే హామీ ప్రజలకు ఇవ్వాలని నిర్ణయించారు.గ్రామస్థులకు ఏ పత్రం కావాలన్నా సచివాలయంలో దొరికే విధంగా ప్రణాళికను పొందుపరచనున్నారు.

టీఆర్‌ఎస్‌ పాలన కేవలం ప్రగతి భవన్‌కే పరిమితమయిందనే అభిప్రాయంతో పాలనను వారంలో ఒక రోజు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కూడా ప్రకటించనున్నారు. దీనికి తోడు అమరవీరుల స్మృతిచిహ్నం ఏర్పాటు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరిట విద్యాసంస్థలు ఏర్పాటుకు హామీ ఇవ్వనున్నారు. అన్ని అంశాలతో దసరా తర్వాత పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. ఈ సమావేశంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు బండ్రు శోభారాణి, అలీ మస్కతి కూడా పాల్గొన్నారు.

సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యం: బండ్రు
మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ఎజెండాగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రూపొందిస్తున్నామని వెల్లడించారు. కార్మికులు, మహిళలు, కర్షకులతో పాటు అన్ని వర్గాల సమస్యలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని, మేధావులు, నిపుణులతో చర్చించి తెలంగాణలోని సబ్బండవర్ణాల సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టోను ప్రజల ముందుపెడతామని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు