అచ్చెన్నాయుడుకు కృపారాణి సవాల్

31 May, 2020 08:10 IST|Sakshi
మాట్లాడుతున్న కిల్లి కృపారాణి   

ప్రభుత్వ పథకాల అమలుపై నిమ్మాడలో బహిరంగ చర్చకు సిద్ధమా?

సాక్షి, టెక్కలి: ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందుతున్నాయని నిరూపించడానికి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో బహిరంగ చర్చకు సిద్ధమా అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి సవాల్‌ విసిరారు. శనివారం ఆమె మాట్లాడుతూ కరోనా భయంతో హోమ్‌ క్వారంటైన్‌కే పరిమితమైన అచ్చెన్నాయుడు ఈ రోజు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని జూమ్‌ యాప్‌లో రాజకీయ ఉనికి చాటుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో పారదర్శకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎక్కడైనా అందలేదని నిరూపించగలరా అని ప్రశ్నించారు. పథకాల్లో అధికంగా టీడీపీ నాయకుల కుటుంబాలే లబ్ధి పొందుతున్నాయని గుర్తు చేశారు. నిమ్మాడలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓట్లు పడలేదని, అదే గ్రామంలో అమ్మఒడి, రైతు భరోసా, విద్యాదీవెన పథకాలు అందలేదని నిరూపించగలరా, దీనిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. సీఎంపై లేనిపోని విమర్శలు చేస్తే ప్రజల నుంచి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.    

>
మరిన్ని వార్తలు