రైతులు నష్టపోయారు 

16 Mar, 2020 02:01 IST|Sakshi

రాష్ట్రానికి ముందుచూపు లేకపోవడం వల్లనే..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌ : కంది, పత్తి కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపును ప్రదర్శించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఖరితోనే రాష్ట్రంలోని కంది, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ దిగుబడులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, కేంద్ర ప్రభుత్వమే చొరవ చూపి కొనుగోలు చేసి రైతులకు ఉపశమనం కలిగించిందన్నారు.ఆదివారం దిల్‌కుషా అతిథిగృహంలో నాఫెడ్, మార్క్‌ఫెడ్, సీసీఐ అధికారులతో కిషన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.కంది రైతులు దిగుబడులను విక్రయించే అంశంలో ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై స్పందించిన కేంద్రం రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులకు మద్దతు ధర దక్కేదని, కందులు క్వింటాలుకు రూ.5,800 ఇస్తున్నామని, కానీ ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు లేక చాలామంది రైతులు రూ.3,500 నుంచి రూ.4,000 వంతున అమ్ముకున్నారన్నారు.ఒక్కో రైతు కనిష్టంగా రూ.1,500 నష్టపోయారన్నారు. రాష్ట్రంలో పండించిన పంటలో దాదాపు 25శాతం దిగుబడులను నాఫెడ్‌ కొనుగోలు చేసిందన్నారు. 51,625 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశామని, మరో లక్ష టన్నులు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందన్నారు.దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీసీఐ ద్వారా చేపట్టామన్నారు.నాసిరరమైనా కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటివరకు 20 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తిని కొనుగోలు చేసినట్లు తెలిపారు.

కరోనాపై అప్రమత్తం
కరోనాపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా తీసుకొస్తున్నామన్నారు. పారామిలిటరీ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, కరోనాపై జాగ్రత్తల విషయంలో పార్లమెంటులో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.  

>
మరిన్ని వార్తలు