కేంద్రమంత్రిగా నా వంతు కృషి చేస్తాను : కిషన్‌ రెడ్డి

2 Jun, 2019 14:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘అన్ని వర్గాల, పక్షాల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. ఉద్యమంలో కలిసి పనిచేసిన స్పూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ అభివ ద్ధిలో కూడా అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని నా విజ్ఞప్తి.

ప్రియతమ ప్రధాని నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఉటంకించిన సమాఖ్య స్ఫూర్తితో రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలు ఆధారంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, అన్ని రకాల సహాయ సహకారాలు  అందించడానికి  సిద్ధంగా ఉంది. అందుకు కేంద్రమంత్రిగా నా వంతు కృషి చేస్తానని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా’అని ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు