అప్పడు చంద్రబాబు ఎలా సీఎం అయ్యారు?

23 Jun, 2019 18:44 IST|Sakshi

న్యూఢిల్లీ : పార్టీ ఫిరాయింపు చట్టాలకు అనుగుణంగానే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గతంలో ఈ విధమైన విలీనాలు చాలా జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 10వ షెడ్యూల్‌ నిబంధనల ప్రకారం ఇప్పటివరకు రాజ్యసభలో 16 సార్లు విలీనాలు జరిగాయని వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్‌ చట్టం ప్రకారమే వ్యవహరించారని అన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ తమ పార్టీలో ఎంతమందిని చేర్చుకున్నారో తెలిసి కూడా ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఈ విధంగా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదేనని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ను కాదని చంద్రబాబు ఏ ప్రతిపాదికన చంద్రబాబు సీఎం అయ్యారో సమాధానం చెప్పాలన్నారు. గతాన్ని చూసుకుని టీడీపీ నేతలు మాట్లాడాలని హితవు పలికారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన టీడీపీ నేతలు.. నేడు రాజ్యంగ బద్ధంగ జరిగిన ప్రక్రియ గురించి విమర్శలు చేయడం దారుణమన్నారు. రాజ్యసభ చైర్మన్‌, బీజేపీ ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యులపై ఎక్కడా కేసులు, చార్జిషీట్‌లు లేవని.. వారిపై ఉన్నవి కేవలం ఆరోపణలే మాత్రమేని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు