కోదండరామ్‌తో చర్చలు నిజమే

28 Sep, 2018 01:13 IST|Sakshi

పురోగతి ఉంటే ప్రకటన చేస్తాం: కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ను కలసిన మాట వాస్తవమేనని, చర్చలు కొనసాగుతున్నాయని బీజేపీ నేత కిషన్‌రెడ్డి చెప్పారు. చర్చ ల్లో ఏమైనా పురోగతి ఉంటే మీడియాకు చెబుతామని స్పష్టం చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరనేది కేంద్ర అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పారు. రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడులు చేయించాల్సిన అవసరం కేంద్రానికి లేదన్నారు.

ఆయనపై దాడులు చేస్తే బీజేపీకి వచ్చేదేమీ లేదన్నారు. ఈ దాడుల విషయంలో బీజేపీపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి చేసే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. ఇటీవల ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయని, ఇదీ బీజేపీనే చేయించిందా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు క్విడ్‌ప్రోకోలా ఉందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో ఒవైసీ ఆస్పత్రికి 500 గజాల స్థలం ఇస్తున్నట్లు గతంలో టీఆర్‌ఎస్‌ ప్రకటించిందన్నారు. ఆ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసిందని, కోర్టు నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు