పగటి వేషగాడు చంద్రబాబు: కొడాలి నాని

6 Jan, 2020 07:55 IST|Sakshi

సాక్షి, గుడివాడ: రాజధాని పేరిట రైతుల నుంచి భూములను లాక్కునేందుకు చంద్రబాబు తన ప్రభుత్వంలో పగటి వేషగాడిలా సొల్లు మాటలను చెబుతూ వచ్చారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) విమర్శించారు. ఆదివారం ఆయన డోకిపర్రులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు కనుమూరి రామిరెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు సాధ్యమైనంత వరకు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి రాజధానిని నిర్మించే విషయంలో దొంగల లాగా బాబు ప్రవర్తించారని పేర్కొన్నారు. 33వేల ఎకరాలను రైతుల నుంచి కొల్లగొట్టేందుకే మాయ మాటలు చెప్పారన్నారు.

రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనా విధానం ఉందని కొడాలి నాని అన్నారు. షిప్‌ యార్డ్, రైలు, విమాన సౌకర్యాలు ఉన్న వైజాగ్‌ను ముంబాయిలా త్వరలో చూడనున్నామని అభిప్రాయపడ్డారు. రాయలసీమలో కోర్టులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. జీఎన్‌ రావు, బోస్టెన్‌ కమిటీలు ఇచ్చిన నివేదికలను బోగీ మంటల్లో వేయమని బాబు వ్యాఖ్యానించటం తగదన్నారు. ఆయన పాలనా విధానాలు నచ్చక రాష్ట్ర ప్రజలు బాబుకు బుద్ధి చెప్పిన  మార్పు రాలేదని చెప్పారు. 74ఏళ్ల చరిత్ర కలిగిన బోస్టన్‌ కంపెనీ నివేదికను తప్పు బట్టే చంద్రబాబు ఎందుకు సింగపూర్‌ కంపెనీతో రూ.800కోట్లకు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. కరెన్సీ నోట్లు మారినపుడు ఆ కంపెనీ నివేదికకు బాబు ఎందుకు తలొగ్గారని అడిగారు.

చదవండి: బాబు చూపిన రాజధాని గ్రాఫిక్స్‌ సాధ్యం కాదు : కొడాలి నాని

ఇప్పటికైనా పిట్టల దొరలా రాజధాని రైతులకు దొంగ మాటలు చెప్పవద్దని హితవు పలికారు. రాజధాని రైతులు తమ కోర్కెలతో తమ ప్రభుత్వాన్ని కలిస్తే జగన్‌ మేలు చేకూరుస్తారని చెప్పారు. అంతేగాని బాబు మాటలు నమ్మి ఇంకా మోస పోవద్దన్నారు. టీడీపీకి చెందిన సుజనా చౌదరి బ్యాంకులను లూటీ చేయటంతో ఎక్కడ జైల్లో వేస్తారోనని బీజేపీలోకి వెళ్లాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మెయిల్‌ డైరెక్టర్‌ పురిటిపాటి వీరారెడ్డి, కేడీసీసీబీ జిల్లా డైరెక్టర్‌ పడమటి సుజాత, వైఎస్సార్‌ సీపీ నేతలు కోగంటి ధనుంజయ, కనుమూరి రామిరెడ్డి, దుగ్గిరాల శేషుబాబు, అల్లూరి ఆంజనేయులు, కోటప్రోలు నాగు, శాయన రవి, బలుసు జితేంద్ర పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు