బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు: కొడాలి నాని

22 Jan, 2020 12:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్యాకేజీలకు అలవాటు పడి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విశాఖను మోసం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు చిల్లర రాజకీయాలు అలవాటేనని.. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు ఆ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. సభలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ‘రైతు భరోసా’ కేంద్రాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతి అని పునరుద్ఘాటించారు. సభలో టీడీపీ సభ్యులు మాత్రం కీలక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో బుద్ధిలేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సభ వాయిదా పడితే చంద్రబాబు జోలె పట్టుకుని అడుక్కోవాలని చూస్తున్నారని.. ఎన్నికల్లో ఓడినా సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని నాని గుర్తుచేశారు. వెలగపూడి రామకృష్ణ బుద్ధి, ఙ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.(టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం)

చర్యలు తీసుకోవాల్సిందే: సుధాకర్‌ బాబు
శాసన సభ స్పీకర్‌ పట్ల టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా వైఎస్‌ జగన్‌ను చూసే ప్రజలు తమకు ఓట్లు వేశారని.. ముఖ్యమంత్రిని అవమానిస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. స్పీకర్‌, సీఎంకు అవమానం జరిగితే చట్టసభలకు విలువ ఉండదని.. టీడీపీ సభ్యుల తీరుపై చర్యలు తీసుకోవాల్సిందేనని విఙ్ఞప్తి చేశారు.(ప్రజాస్యామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తోంది: సీఎం జగన్‌)

ఇక చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. టీడీపీ సభా సంప్రదాయాలు మరచిపోయిందని విమర్శించారు. సభలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అదే విధంగా వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే చిన్నవెంకట అప్పలనాయుడు సైతం టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండాలంటే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు