ఆంధ్రా పాలకుల కంటే దుర్మార్గం: కోదండరాం

29 Oct, 2017 02:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా ఉద్యమాలు, శాంతియుత నిరసనలను అప్రజాస్వామికంగా అణచివేయడంలో ఆంధ్రా పాలకుల కంటే తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం మండిపడ్డారు. శనివారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31న ‘కొలువుల కోసం కొట్లాట’యాత్రను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామన్నారు.

ఈ యాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. నల్లగొండ, సూర్యాపేట ఎస్పీలు అనుమతిలేదంటూ చేసిన వాదనను కోర్టు కొట్టివేసిందన్నారు. అనుమతి ఇవ్వాల్సిందేని కోర్టు చేసిన సూచన ప్రకారం మరోసారి పోలీసులను అనుమతి కోరుతామన్నారు. యాత్రను అడ్డుకునే అధికారం పోలీసులు, ప్రభుత్వానికి లేదన్నారు.

సభను అడ్డుకునేందుకు పోలీసులు చట్టాన్ని అతిక్రమించేందుకు కూడా సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఇలాంటి అప్రజాస్వామిక, అరాచక చర్యలు ఆంధ్రా పాలకుల హయాంలో కంటే ప్రస్తుతమే దుర్మార్గంగా ఉన్నాయన్నారు.

మరిన్ని వార్తలు