దుబ్బాక టౌన్/చేగుంట (తూప్రాన్): ‘ఇక కాచుకో కేసీఆర్.. తెలంగాణ ప్రజలు నీ గడీల పాలనకు చరమగీతం పాడేరోజులు దగ్గర్లోనే ఉన్నయ్. ఇయ్యాళ అత్యవసంగా ఎందుకు కేబినెట్ మీటింగ్ పెట్టినవ్. ముందస్తు ఎన్నికల కోసమేనా? ఎన్నికలు ముందొస్తే ముందే.. వెనకొస్తే వెనకే రాష్ట్ర జనం నిన్ను ముంచేందుకు సిద్ధంగా ఉన్నారు’అని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. బుధవారం దుబ్బాకలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రాజ్కుమార్తోపాటు పలువురు పార్టీలో చేరారు. ఆయన మాట్లాడుతూ, ‘ఖబడ్దార్ కేసీఆర్.. తెలంగాణ ఏమన్నా నీ జాగీరనుకుంటున్నావా.
నీదగాకోరు పాలనకు రోజులు దగ్గరపడ్డాయి. ఉత్త పుణ్యానికి రూ.40 వేల కోట్లు దోచుకున్నావ్. ఈ ఎన్నికల్లో టీజేఎస్ అధికారంలోకి వస్తుందని, ఆపై నిన్ను జైల్లో పెట్టడటం ఖాయం’అని నిప్పులు చెరిగారు. తమని మాట్లాడనివ్వడం లేదని మీ ఎమ్మెల్యేలు, మంత్రులు తనతో చెప్పారన్నారు. ప్రజలే మిమ్మల్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తమ పార్టీ బలహీనంగా లేదని, చాలామంది ప్రముఖులు పార్టీలోకి వచ్చేం దుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
మధ్యలో దిగిపోవడానికా గెలిపించింది..
మధ్యలో దిగిపోవడానికేనా పూర్తి మెజార్టీతో గెలిపించింది అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోదండరాం ప్రశ్నించారు. దబ్బాక సమావేశానికి వెళ్తూ చేగుంటలోని గాంధీ చౌరస్తా వద్ద టీజేఎస్ జెండాను ఆవిష్కరించారు.