బకాయిల వల్లే టెండర్లకు కాంట్రాక్టర్లు దూరం

18 Sep, 2019 03:39 IST|Sakshi

అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్‌కి పబ్లిసిటీ పిచ్చి పట్టిందన్న మంత్రి తలసాని

పద్దులపై చర్చ సందర్భంగా కాసేపు అసెంబ్లీలో గందరగోళం

సాక్షి, హైదరాబాద్‌: బకాయిలు పేరుకుపోవడంతో వివిధశాఖల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మం గళవారం వివిధ శాఖల పద్దుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతా కలిపి రూ.27 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు నిరాశపరిచిందన్నారు. వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు పాత బకాయిలకు సరిపోవన్నారు. సీఎం మరో రెండు మార్లు తానే అధికారంలో ఉంటానని ధీమాగా చెబుతున్నారని, కానీ ఆయనకు మరో నాలుగేళ్లు మాత్రమే అధికారంలో ఉండేందుకు ప్రజలు ఓటేశారన్నారు. రెండోసారి అధికారం కట్టబెడితే తనపై నమ్మకంలేక ప్రతిపక్షసభ్యులను పారీ్టలోకి చేర్చుకోవడం దారుణమని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. దీంతో అధికారపక్ష సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. గందరగోళం నెలకొనడంతో సభలో రసాభాస జరిగింది. ‘మీకు మీ సీఎంను అడిగే దమ్ములేదు. అలాంటిది మమ్మల్ని అడ్డుకుం టే ఎలా? మమ్మల్ని నోరుమూసుకొని కూర్చోవడానికి ప్రజలు ఇక్కడకు పంపించలేదు. ప్రశ్నించాలని పంపించారు. నా గొంతును మూసేసే దమ్ము మీకు లేదు’ అని రాజగోపాల్‌రెడ్డి అధికారపక్ష సభ్యులను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు.  

భజనపరులకు ప్రజాసమస్యలు అర్థంకావు...
సీఎం ఏం చేసినా కీర్తిస్తూ మంత్రులు ఆయనకు భజనపరుల్లాగా మారారని, వారికి జనం సమస్య లు అర్థం కావని, తాను ఎమ్మెల్యేగా ప్రజల సమ స్యలను దగ్గరగా చూసి చెబుతున్నానని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు వంద రోజుల ప్రణాళిక అంటూ హడావుడి చేస్తున్నారని, చివరకు నిధులు మాత్రం ఇవ్వర న్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకున్నా, ఉద్యమనేత సీఎం అయ్యారని సంతోషించామని, కానీ ఆయన ప్రజల పక్షాన పనిచేయటం లేదన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంæ అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందన్నారు.

పార్టీ మారితే రాజీనామా చేస్తా...
తాను పార్టీ మారితే రాజీనామా చేసి మరో పారీ్టలో చేరతానని, తలసానిలా వేరే పారీ్టలో చేరి మంత్రి పదవి పొందలేదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి తలసాని మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పబ్లిసిటీ పిచ్చి ఉందన్నారు. రాజ గోపాల్‌ ఇక్కడ ఏదో మాట్లాడి.. ఆ తర్వాత నెల రోజులపాటు గాయబ్‌ అవుతారని ఎద్దేవా చేశారు. ఇంతలో దానం నాగేందర్‌ జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్‌ పక్ష నేత భట్టి విక్రమార్క జోక్యం చేసు కుని ‘నాగేందర్‌ మంత్రిగా లేరు. ఆయన ఎలా జోక్యం చేసుకుంటూ మాట్లాడతారు? ఇంకా తాను మంత్రి అని అనుకుంటున్నారేమో’ అని చురకలంటించారు. మాట్లాడుతుంటే మధ్యలో మైక్‌ కట్‌ చేస్తారా... అంటూ భట్టి స్పీకర్‌ను ప్రశ్నించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ భట్టి సీఎల్పీ లీడర్‌ కాదని, ఆయన అందరిలాగే సాధారణ సభ్యుడన్నారు. తాను కాంగ్రెస్‌ పక్ష నేత అని భట్టి జవాబిచ్చారు.  

సభలో మున్సిపల్‌ బిల్లు
జీరో అవర్‌ అనంతరం సభ ప్రారంభమైన వెంటనే మంత్రి కేటీఆర్‌ మున్సిపల్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. పం చాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్‌ శాఖలకు చెందిన పద్దులను మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. పద్దులపై టీఆర్‌ఎస్‌ సభ్యుడు నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేయా లని, దీనివల్ల మహిళలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మరో సభ్యుడు రామ లింగారెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలన్నారు. ఎంఐఎం సభ్యుడు మొయినుద్దీన్‌ మాట్లాడుతూ నగరంలో వైరల్, డెంగీ జ్వరాలు పెరిగాయని, ఆసుపత్రుల్లో వసతులు పెంచాలని అన్నారు.

మరిన్ని వార్తలు