‘మేము తినే బుక్క మీకు పెట్టి కాపాడుకుంటాం’

17 Oct, 2019 16:14 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి :  ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, వీటిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే పరిష్కరించాలని భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హయత్‌ నగర్‌ బస్‌ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా గురువారం ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కార్మికులు ఎవరు అధైర్యపడవద్దని, తమ వెంట నాలుగు కోట్ల ప్రజలున్నారని ధైర్యం చెప్పారు. మేము తినే బుక్క మీకు పెట్టి మరి కాపాడుకుంటామని అభయమిచ్చారు.

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వందల కోట్లు ఖర్చు పెడుతోందని, అయినా ఓటమి తప్పదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్‌ కుర్చి పోయే కాలం వచ్చిందని అభిప్రాయపడ్డారు. కిరాయి డ్రైవర్స్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటికి కేసీఆర్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు అండగా కాంగ్రెస్‌ పార్టీ ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సంబంధం లేని మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఇప్పటికైనా ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని ఎంపీ సూచించారు. 

>
మరిన్ని వార్తలు