కొండా దంపతుల భేటీ.. తాజా నిర్ణయం!

10 Sep, 2018 16:30 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ తమకు టికెట్‌ ఇవ్వకుండా సస్పెన్స్‌లో పెట్టిన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు హన్మకొండ రామ్‌నగర్‌లో కొండా సురేఖ, కొండా మురళీ దంపతులు సోమవారం తమ అనుచరులతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ తమకు టికెట్‌ ఇవ్వకుండా సస్పెన్స్‌కు గురిచేయడం.. ఆ తదనంతర పరిణామాలను కొండా సురేఖ దంపతులు తమ కార్యకర్తలకు వివరించారు. దీంతో టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి.. బయటకు రావాలని కార్యకర్తలకు వారికి సూచించారు. అయితే, ఈ నెల 23వ తేదీ వరకు వేచి చూద్దామని, అప్పటికీ టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం నుంచి స్పందన రాకపోతే.. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని కొండా దంపతులు తమ అనుచరులకు స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం తీరుపై ఇప్పటికే కొండా సురేఖ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ అంటే ‘కల్వకుంట్ల’ ఇల్లు కాదని ఆమె కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో కొండా దంపతులు తిరిగి కాంగ్రెస్‌ పార్టీ గూటికి చేరే అవకాశముందని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం నుంచి వచ్చే స్పందన బట్టి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు