అవినీతి మంత్రి మాకొద్దంటూ టీడీపీ నేతల ర్యాలీ

27 Feb, 2019 12:12 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాట రోడ్డుకెక్కింది. స్థానిక టీడీపీ నేతలు.. మంత్రి జవహర్‌ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా విడిపోయారు. టీడీపీ అధిష్టానం జవహర్‌కు టికెటు కేటాయించవద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం బుధవారం భారీ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా అవినీతి మంత్రి మాకొద్దంటూ జవహర్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. జవహర్‌ నుంచి పార్టీని రక్షించాలని డిమాండ్‌​ చేశారు. కొవ్వూరు పట్టణంతో పాటు రూరల్‌ గ్రామాల్లో జవహర్‌కు వ్యతిరేకంగా బైక్‌ ర్యాలీలు చేపడుతున్నారు.

జవహర్‌ వ్యతిరేక వర్గానికి కొవ్వూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ సూరపునేని రామ్మోహన్‌రావు, సీనియర్‌ నాయకులు ఉప్పులూటి నారాయణరావు నాయకత్వం వహిస్తున్నారు. జవహర్‌కు టికెట్‌ కేటాయిస్తే పార్టీ దారుణంగా ఓడిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాగా, మంగళవారం రోజున ప్రజా దీవెన యాత్ర పేరుతో జవహర్‌ అనుకూల వర్గం ర్యాలీ నిర్వహించింది. అందులో జవహర్‌ కూడా పాల్గొన్నారు. అయితే నిన్న జవహర్‌ చేపట్టిన ర్యాలీకి వ్యతిరేకంగానే ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఈ ర్యాలీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు