కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌కు గవర్నర్‌ షాక్‌

15 May, 2018 16:09 IST|Sakshi
కర్ణాటక పీసీసీ చీఫ్‌ పరమేశ్వర, గవర్నర్‌ వజుభాయ్‌ వాలా(ఫైల్‌ ఫొటోలు)

సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ ఏర్పాటుకు విశ్వప్రయత్నాలు చేస్తోన్న కాంగ్రెస్‌ పార్టీనేతలు ఒకింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. నిర్ణీత గడువుకు కంటే ముందే కర్ణాటక గవర్నర్‌ వజుభాయ్‌ రుడాభాయ్‌ వాలాను కలుసుకోవడానికి వెళ్లిన పీసీసీ చీఫ్‌ పరమేశ్వరకు చేదు అనుభవం ఎదురైంది. మద్దతుదారుల జాబితాతో వెళ్లిన ఆయనకు.. రాజ్‌భవన్‌లోకి అనుమతి లభించలేదు. దీంతో ఆయన కంగుతిన్నారు.

చాలాసేపు అక్కడే వేచిచూసిన పరమేశ్వర.. చివరికి గవర్నర్‌ సందేశంతో వెనుదిరిగారు. ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడనందున ఇప్పుడప్పుడే తాను ఎవరినీ కలవబోనని గవర్నర్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. వాస్తవానికి జేడీఎస్‌-కాంగ్రెస్‌ నేతల బృందంతో సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఖరారైంది. కానీ ఆ సమయం కంటే ముందే వజుభాయ్‌ని కలిసేందుకు పరమేశ్వర చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

>
మరిన్ని వార్తలు