‘ఉద్యోగులను వెంటనే పర్మినెంట్‌ చేయాలి’

5 Sep, 2018 01:37 IST|Sakshi

హైదరాబాద్‌: వివిధ ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగాలలో, కార్పొరేషన్లలో, యూనివర్సిటీలలో పనిచేస్తున్న దాదాపు 2 లక్షల 50 వేల మంది కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్, దినసరి వేతన ఉద్యోగులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని తెలంగాణ కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమావేశం డిమాండ్‌ చేసింది. మంగళవారం బీసీ భవన్‌లో గుజ్జ కృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్‌.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో తాత్కాలిక ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేస్తామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. అధికారం చేపట్టి 4 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ ఒక్క ఉద్యోగాన్ని కూడా రెగ్యులరైజ్‌ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులు అడ్డుతగులుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనడం సరికాదని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

మరిన్ని వార్తలు