3 సీట్ల కోసం పొర్లుదండాలా?

26 Sep, 2018 03:46 IST|Sakshi

కోదండరాం కాంగ్రెస్‌తో పొత్తుపై కేటీఆర్‌ ధ్వజం

సాక్షి, సిరిసిల్ల: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ముష్టి మూడు సీట్ల కోసం కాంగ్రెస్‌ నేతల చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిం చిన అనంతరం బతుకమ్మ ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆత్మగౌరవం కోసం అంటూ పార్టీ స్థాపించిన కోదండరాం కాంగ్రెస్‌తో జత కట్టి ఆత్మవంచన చేసుకోవద్దని, ఒకసారి పునరాలోచించుకోవాలని కోరారు.

సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా కేసులేసి, అనుమతులు ఇవ్వొద్దని ఉత్తరాలు రాసిన కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకోవాలని ఏ అమరవీరుడు కోరాడంటూ ప్రశ్నించా రు. అధికార దాహంతోనే అమరులు కావడానికి కారణమైన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ.. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు గుడ్డలూడదీసి కొడతారని ఆ పార్టీకి చెందిన ఏపీ మంత్రులు కేఈ కృష్టమూర్తి, చినరాజప్ప, అయ్యన్నపాత్రులు అంటుంటే.. ఏ కారణంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారో ఇక్కడి టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అప్పుడు మేం మంచోళ్లమా?
కొండా దంపతుల వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందిస్తూ.. పార్టీ వీడి వెళ్లిపోవాలనుకునే వారు అలాగే మాట్లాడతారని చెప్పారు. పార్టీలో ఉన్నన్ని రోజులు తాము మంచివాళ్లుగా.. వెళ్లిపోయేటప్పుడే శత్రువుల్లా కనిపిస్తున్నామని వ్యాఖ్యానించారు. పోయేటప్పుడు రాళ్లేసి పోవడం సహజమేనని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు