అవును.. అంట్లు తోమా!

9 Sep, 2018 01:56 IST|Sakshi

 నా ఇంట్లో నేను తోమా.. తప్పేముంది

ఉత్తమ్‌ వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో కేటీఆర్‌ ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘అమెరికాలో ఉన్నపుడు ఇంట్లో నేను అంట్లు తోమి ఉండొచ్చు. అయినా యూఎస్‌లో ప్రతి భారతీయుడు తమ ఇళ్లలో చేసే పనే ఇది. మీ పప్పు (రాహుల్‌గాంధీ)లా కాకుండా స్వయంగా కష్టపడి పని చేసి సంపాదించి గౌరవంగా బతికినందుకు గర్వపడుతున్నా’అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఆపద్ధర్మ మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. ‘మేమిక్కడ రాజకీయాల్లో ఉన్నపుడు కేటీఆర్‌ యూఎస్‌లో కచ్చితంగా అంట్లు తోముతూ ఉండేవాడు. ఇండియాకు వచ్చి తండ్రి కేసీఆర్‌ పలుకుబడి ఉపయోగించుకుని రాజకీయాల్లోకి వచ్చాడు.

తాను మాట్లాడింది అందరూ వినాలనుకుంటున్నాడు. ఈయనకు కనీస మర్యాద తెలియదు. మంత్రిగా ఉండేందుకు అర్హత లేదు’అని ఉత్తమ్‌ చేసిన వ్యాఖ్యలపై శనివారం ట్వీటర్‌లో తీవ్ర స్థాయిలో కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. ఉత్తమ్‌లా ప్రజల సొమ్మును దోచి కారులో కాల్చేయలేదన్నారు. గత సాధారణ ఎన్నికల సందర్భంగా 2014 మే 1న ఉత్తమ్‌ కారులో దగ్ధమైన కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్‌ ఒబామా కూడా ఇంట్లో అంట్లు తోముకుంటారని ఓ వెబ్‌సైట్లో వచ్చిన వార్తను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ శ్రమ యొక్క గౌరవం నీలాంటి పెత్తందార్లకు తెలియకపోవచ్చని కేటీఆర్‌ విమర్శించారు.

కుంతియా.. స్కాంగ్రెస్‌ జోకర్‌
సామ్‌సంగ్, ఆపిల్‌ సంస్థలు హైదరాబాద్‌లో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకొచ్చినా కేటీఆర్‌ పెట్టిన నిబంధనలు, అవినీతి వల్ల ఆ ఆలోచన విరమించుకున్నాయని ఏఐసీసీ పరిశీలకుడు కుంతియా చేసిన ఆరోపణలపైనా కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ఆపిల్‌ సంస్థ 2016 ఆగస్టు నుంచి హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిందని.. ప్రస్తుతం 3,500 మందికిపైగా ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారని చెప్పారు. అమెరికా తర్వాత హైదరాబాద్‌ కేంద్రంలోనే ఆపిల్‌ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారన్నారు. ఏఐసీసీ (ఉరఫ్‌ ఢిల్లీ సల్తనేట్‌) పరిశీలకుడు కుంతియా చేసిన ఇలాంటి ఆరోపణలు స్కాంగ్రెస్‌ జోకర్లు మాత్రమే చేయగలరని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు