మహా కూటమి.. ఇంత మోసమా: కేటీఆర్‌ 

2 Dec, 2018 15:47 IST|Sakshi

లగడపాటి సర్వే ఓ జోక్‌

చంద్రబాబు.. కరెంట్‌ వైర్లతో జర జాగ్రత్త

ట్విటర్‌లో కేటీఆర్‌ చిట్‌చాట్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ప్రకటించిన మేనిఫెస్టోపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలం ఉంటే డబుల్‌ బెడ్‌రూం ఇంటి నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు, మిగతా వర్గాల పేదలకు రూ. 5 లక్షలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. సరిగ్గా పోలింగ్‌కు ముందు ఇప్పుడు మాట మార్చిందన్నారు. మొన్నటి వరకు డబ్బులిస్తామని చెప్పి.. ఇప్పుడు అది రుణమని ప్రకటనలు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. ఆదివారం దినపత్రికల్లో వచ్చిన మహాకూటమి వాణిజ్య ప్రకటనల స్క్రీన్‌ షాట్లను షేర్‌ చేస్తూ.. కూటమి మోసాన్ని ట్విటర్‌ వేదికగా ఎండగట్టారు.  

లగడపాటి సర్వే ఓ జోక్‌..
తెలంగాణ ఎన్నికల్లో తన సర్వే ప్రకారం 10 మంది స్వతంత్ర్య అభ్యర్థులు విజయం సాధిస్తారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ అదో పెద్ద జోక్‌ అని, అవన్నీ నకిలీ సర్వేలని, వాటిని విశ్వసించవద్దని సూచించారు. ఆదివారం నెటిజన్లతో ట్విటర్‌ వేదికగా చిట్‌చాట్‌ చేసిన కేటీఆర్‌.. వారడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. శంకర్‌ 2.0, రాజమౌళి బాహుబలి చిత్రాల గ్రాఫిక్స్‌లకన్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి వీఎఫ్‌ఎక్స్‌ గ్రాఫిక్స్‌ సూపర్‌ అని ఓ నెటిజన్‌ ప్రస్తావించగా.. దీనికి కేటీఆర్‌ సైతం అంగీకరించారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రోడ్‌ షో నిర్వహిస్తున్న చంద్రబాబు విద్యుత్త్‌ వైర్లతో జాగ్రత్తగా ఉండాలని, ఇక్కడ 24 గంటల కరెంట్‌ ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు అంశాన్ని టీఆర్‌ఎస్‌ సరిగ్గా ప్రచారానికి వాడుకోవడం లేదని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సమాధానమిచ్చారు. మరో నెటిజన్‌ కేసీఆర్‌ మిమ్మల్ని ఏమని పిలుస్తారని ప్రశ్నించగా.. రాము అని పిలుస్తారని, అది తన నిక్‌నేమ్‌ అని సమాధానమిచ్చారు. చంద్రబాబు మొబైల్‌ కనిపెట్టానని చెప్పారని, దీనిపై అభిప్రాయం ఏమనగా.. ఆయన చందమామను కూడా కనిపెట్టారని సెటైర్‌ వేశారు.

మరిన్ని వార్తలు