మేము తప్పు చేయం.. చెయ్యబోం: కేటీఆర్‌

15 Sep, 2019 11:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వదు. నల్లమలలో యురేనియం ఉందా లేదా అని తెలుసుకోవటానికి మాత్రమే ఏఎమ్‌డీ  వాళ్లు పరీక్షలు చేస్తున్నారు. కేసీఆర్ పర్యావరణ ప్రేమికుడు.. అటవిని కూల్చరు. 2009లో తవ్వకాలకు  పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తవ్వుతున్నది బీజేపీ అని మేము చెప్పవచ్చు.. కానీ, మేము చెప్పం. యురేనియం తవ్వకాలపై సీఎంతో చర్చించి అధికారికంగా తీర్మానం పెట్టేలా ప్రయత్నం చేస్తాం. మేము తప్పు చేయం.. చెయ్యబోం’’ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం శాసనమండలి సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా యురేనియం తవ్వకాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

కొందరు రాజకీయ నాయకులు  బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక పార్టీ  అధ్యక్షుడు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలవకుండా వారు మాట్లాడుతున్నారని అన్నారు. వార్తా పేపర్లు కూడా తప్పులు ప్రచురిస్తున్నాయని తెలిపారు. నర్సీ రెడ్డి పేపర్ చూసి మాట్లాడినట్టు ఉన్నారని, పేపర్‌లో రాసినట్టు ఏమీ ఉండదన్నారు. ఒక ఎంపీ అక్కడి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి వేళ పనులు చేయకూడదని, బోర్లు తవ్విన వాటిని పూడ్చాలని చెప్పామన్నారు.

>
మరిన్ని వార్తలు