హామీలను గుర్తు చేయండి : కేటీఆర్‌

16 Nov, 2019 02:28 IST|Sakshi
పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో నామా, కేకే తదితరులు 

కేంద్ర మంత్రుల హామీలను వారి దృష్టికి తీసుకెళ్లండి: కేటీఆర్‌

రక్షణ భూముల బదలాయింపు, ఫార్మాసిటీకి నిధుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఢిల్లీలోనూ టీఆర్‌ఎస్‌ కార్యాలయం తొలిసారిగా కేటీఆర్‌ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని గతంలో కేంద్ర మం త్రులు హామీ ఇచ్చారని, కానీ చాలా కాలంగా పెం డింగ్‌లో ఉన్న వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు ఎంపీలకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న వినతులకు పరిష్కారం దక్కేలా చొరవ తీసుకుని కేంద్ర మంత్రులకు గుర్తు చేయాలని కోరారు. తెలంగాణ భవన్‌లో శుక్ర వారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో తొలిసారి కేటీఆర్‌ అధ్యక్షత వహిం చారు. హైదరాబాద్‌లో రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల విస్తరణ కోసం రక్షణ భూముల బదలాయింపు, ఫార్మాసిటీకి సూత్రప్రాయంగా నిమ్జ్‌ హోదా దక్కినందున నిధుల సాధన వంటి తక్షణ అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఐఐఎం వంటి విద్యా సంస్థలతో పాటు బయ్యా రం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు తదితరాలను ఫాలో అప్‌ చేయాలన్నారు.

మిషన్‌ భగీరథ పథకానికి కేంద్ర నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి విజ్ఞప్తులను సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. కేంద్ర బడ్జెట్‌ రూపకల్పన ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రానికి దక్కాల్సిన ప్రాజెక్టులు, నిధుల తో పాటు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వంటి దీర్ఘకాలిక డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే పనిచేయాలన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్న టీఆర్‌ఎస్‌ ఎంపీలు..ఆయా శాఖల పరిధిలో ఉన్న పథకా లు, ప్రయోజనాలు తెలంగాణకు తీసుకురావడానికి ప్రయ త్నం చేయాలన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, దేశ రాజ ధాని ఢిల్లీలోనూ పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. పార్టీ పార్లమెంటరీ పక్ష నేత డాక్టర్‌ కే. కేశవరావు తెలంగాణ భవన్‌కు రాగానే కేటీఆర్‌ స్వాగతం పలికారు. పార్టీ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, బడుగుల లింగయ్య యాదవ్, ప్రకాశ్‌ ముదిరాజ్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్, పసునూరు దయాకర్, మాలోత్‌ కవిత, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పి.రాములు, రంజిత్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పరంగా పార్లమెంట్‌ సమావేశాల్లో లేవనెత్తాల్సిన 30 అంశాలకు సంబంధించిన వాటి పురోగతిపై సమావేశంలో సమీక్షించారు. కాగా, రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె హాట్‌ టాపిక్‌ కావడం, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ తన మీద పోలీసు దాడి గురించి ప్రివిలేజ్‌ నోటీస్‌ ఇవ్వడంతో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్లమెంట్‌ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తేందుకు వ్యూహరచన చేస్తున్నందున ఎలా తిప్పి కొట్టాలనే దానిపైనా కేటీఆర్‌ సూచనలు చేశారు. సీఎం కేసీఆర్‌  చెప్పిందే అక్కడ కూడా వినిపించాలని సూచించారు.

చర్చించిన ప్రధాన అంశాలు ఇవే...

  • హైదరాబాద్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ ఏర్పాటు 
  • రాష్ట్ర పునర్విభన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన 
  • బీఆర్‌జీఎఫ్‌ డిస్ట్రిక్ట్‌ గ్రాంటు కింద తదుపరి వాయిదా డబ్బుల విడుదల 
  • హైదరాబాద్‌లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) ఏర్పాటు 
  • రాష్ట్రంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) ఏర్పాటు 
  • తెలంగాణ విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా కోల్‌ బ్లాక్‌ల కేటాయింపు 
  • హైదరాబాద్‌–నాగపూర్, హైదరాబాద్‌–వరంగల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధికి నిధులు 
  • వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు రూ.వెయ్యి కోట్ల గ్రాంటు 
  • ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా యూనిట్‌ పునరుద్ధరణ
మరిన్ని వార్తలు