నేటి నుంచి కేటీఆర్‌ ప్రచారం

27 Mar, 2019 04:41 IST|Sakshi

ఏడు లోక్‌సభ సెగ్మెంట్లలలో నిర్వహణ

వరుసగా బహిరంగ సభలు, రోడ్‌షోలు

సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మొదలు

నల్లగొండలో రోడ్‌ షోతో ముగింపు

షెడ్యూల్‌ విడుదల చేసిన పోచంపల్లి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. సొంత నియోజకవర్గం సిరిసిల్ల నుంచి బుధవారం ప్రచారం మొదలుపెడుతున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, నల్లగొండ, మహబూబాబాద్, భువనగిరి, కరీంనగర్‌లో కేటీఆర్‌ ప్రచారం నిర్వహించనున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 9 వరకు కేటీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు మంగళవారం కేటీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ విడుదల చేశారు.

సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కేటీఆర్‌ రోడ్‌ షోలు నిర్వహించనున్నా రు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ రోడ్‌ షో నిర్వహణ ప్రక్రియను సమన్వయం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. అన్ని స్థానాల్లో భారీ ఆధిక్యంతో గెలుపు కోసం సీఎం కేసీఆర్, కేటీఆర్‌ పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు.

టీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు గెలుచుకోని సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, నల్లగొండ సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తాను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావ డంతో కీలక నియోజకవర్గాలపై స్వయంగా కేటీఆర్‌ దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార ప్రక్రియ ను సమన్వయం చేస్తూనే ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా నల్లగొండ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల సెగ్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల తరహాలో ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు.

కేటీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ ఇదీ...
► మార్చి 27న సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్‌ నుంచి ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రోజు స్థానికం గా జరగనున్న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

► మార్చి 29న సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట, వీరన్నపల్లె మండలాల్లో స్థానిక సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు కరీంనగర్‌లో రోడ్‌షో నిర్వహించి అక్కడే బహిరంగ సభకు హాజరవుతారు.  
► మార్చి 30న ఉదయం నర్సంపేట, ములుగు నియోజక వర్గాల్లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి తాండూరు, వికారాబాద్‌లో రోడ్‌ షోల్లో పాల్గొంటారు.

► మార్చి 31న సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేటలో స్థానిక కార్యక్రమాలకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటల నుంచి పరిగి, చేవెళ్లలో రోడ్‌షోలు నిర్వహిస్తారు.

► ఏప్రిల్‌ 1న సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో రోడ్‌ షోలో పాల్గొంటారు.

► ఏప్రిల్‌ 2న సిరిసిల్లలో స్థానికంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఉప్పల్, మల్కాజ్‌గిరి రోడ్‌ షోలో పాల్గొంటారు.  

► ఏప్రిల్‌ 3న మధ్యాహ్నం 12 గంటలకు హుజూర్‌నగర్‌లో జరుగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, మేడ్చల్‌లో రోడ్‌ షో నిర్వహిస్తారు.

► ఏప్రిల్‌ 4న మధ్యాహ్నం 12 గంటలకు ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి అంబర్‌పేట, ముషీరాబాద్‌లో రోడ్‌ షో నిర్వహిస్తారు.

► ఏప్రిల్‌ 5న ఉదయం 10 గంటలకు కోదాడలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదు గంటల నుంచి సికింద్రాబాద్, సనత్‌నగర్‌లో రోడ్‌షోలో పాల్గొంటారు.  

► ఏప్రిల్‌ 6న సాయంత్రం జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి నియోజక వర్గాల్లో రోడ్‌ షో నిర్వహిస్తారు.

► ఏప్రిల్‌ 7న ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్‌లలో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర నుంచి రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో రోడ్‌ షోలు నిర్వహిస్తారు.

► ఏప్రిల్‌ 8న ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో వేర్వేరుగా జరగనున్న బహిరంగ సభలకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ సెగ్మెంట్లలో రోడ్‌షోలో పాల్గొంటారు.

► ఏప్రిల్‌ 9న నల్లగొండలో రోడ్‌ షో నిర్వహించి ప్రచారం పూర్తి చేస్తారు.

లోక్‌సభ బాధ్యుల మార్పు...
లోక్‌సభ ఎన్నికల టీఆర్‌ఎస్‌ బాధ్యుల విషయంలో స్వల్ప మార్పులు జరిగాయి. మొదట నల్లగొండ లోక్‌సభకు నూకల నరేశ్‌రెడ్డి, ఖమ్మం లోక్‌సభకు తక్కళ్లపల్లి రవీందర్‌రావుకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. తాజాగా వీరిద్దరి సెగ్మెంట్లను పరస్పరం మార్చుతూ టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో రవీందర్‌రావు నల్లగొండ లోక్‌సభకు, నరేశ్‌రెడ్డికి ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌ బాధ్యతలను అప్పగించారు.

మరిన్ని వార్తలు