సాక్షి, హైదరాబాద్ : ఈ రోజు రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్కు తెలంగాణ ఐటీ మంత్రి కే తారకరామారావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కమల్ రాజకీయ పార్టీని ప్రకటిస్తున్న సందర్భంగా నేటి (బుధవారం) సాయంత్ర మదురైలో నిర్వహించబోతున్న సభకు తనను కూడా ఆహ్వానించారని కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు.
‘రాజకీయాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా మదురైలో నిర్వహిస్తున్న సభకు నన్ను కూడా పిలిచినందుకు కమల్ హాసన్జీకి ధన్యవాదాలు. భౌతికంగా నేను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నాను. కానీ, నూతన ప్రస్తానం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. నిజజీవితంలోనూ ‘నాయకన్’గా మీరు బాగా రాణించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
మదురైలో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తోపాటు పలువురు నేతలను కమల్ హాసన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సభలో కమల్ తన రాజకీయపార్టీ పేరును ప్రకటించి.. పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పార్టీ లక్ష్యాలను వివరించారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హీరోగా తెరకెక్కిన ‘నాయకన్’(నాయకుడు) సినిమా సూపర్హిట్ అయిన సంగతి తెలిసిందే.