బంతి.. గవర్నర్‌ కోర్టులో 

7 Jul, 2019 11:22 IST|Sakshi

ఏ నిర్ణయం తీసుకుంటారో!  

కుమారస్వామి రాజీనామా చేస్తారా?  

జోరుగా ఊహాగానాలు  

సాక్షి బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వం డోలాయమానంలో పడడంతో రాష గవర్నర్‌ వజూభాయ్‌వాలా తదుపరి ఏం చేస్తారనే దానిపై అందరి దృష్టి మళ్లింది. ఆపరేషన్‌ పక్కాగా నిర్వహిస్తున్న యడ్యూరప్ప, ఇతర బీజేపీ కేంద్రమంత్రులు, సీనియర్లు దీనిపై నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దయి మధ్యంతర ఎన్నికలు వస్తాయా? లేక రాష్ట్రపతి పాలన తప్పదా? అనేది సస్పెన్స్‌గా మారింది. సీఎం కుమారస్వామి బెంగళూరుకు రాగానే ఏం చేస్తారనేది తెలుస్తుంది.

చదవండికన్నడ సంక్షోభం

సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న అసమ్మతి ఒక్కసారిగా తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యేల నుంచి రాజీనామాలు లేఖలు అందుకున్న గవర్నర్‌ వజూభాయ్‌వాలా ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది అనేది కీలకంగా మారింది. సంకీర్ణ సర్కారును బలం నిరూపించుకోమంటారా?, అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి అవకాశమిస్తారా? అనేదానిపై రాజకీయ పండితు లు సైతం ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖతో ఆయన ఎప్పటికప్పుడు సంప్రదింపుల్లో ఉన్నారు. నైతికంగా బాధ్యత వహించి ఈ నేపథ్యంలో సీఎం కుమారస్వామి రాజీనామా చేస్తారా? లేక కొనసాగుతారా? అనేది చర్చనీయంగా మారింది.                                         

మాకు సంబంధం లేదు: యడ్డి 
కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామాతో తనకు ఎలాంటి సంబంధం లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. గవర్నర్‌ను కలవనని, స్పీకర్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అంతేకానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు చేయలేదన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో గందరగోళం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతి కార్యాలయానికి మంత్రి డీకే శివకుమార్‌ వెళ్లి ఒక ఎమ్మెల్యే రాజీనామా పత్రం చింపివేయడాన్ని ప్రజలు చూస్తున్నారని అన్నారు.  

యడ్యూరప్పే సీఎం : డీవీఎస్‌ 
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానిస్తే యడ్యూర ప్ప సీఎంగా బీజేపీ సర్కారును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి డీవీ సదానందగౌడ తెలిపారు. అసమ్మతి నేపథ్యంలో నైతిక బాధ్యతగా కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరారు. 

కాంగ్రెస్‌ మంతనాలు  
కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో మాజీ సీఎం సిద్ధరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈక్రమంలో మంత్రులు కృష్ణభైరేగౌడ, యూటీ ఖాదర్, కేజే జార్జి, దేశపాండే, డీకే శివకుమార్‌తో రాజీనామా చేయించి వారి స్థానంలో అసంతృప్తులకు మంత్రి పదవులు కట్టబెట్టాలని తీర్మానించినట్లు సమాచారం. అయితే మంత్రులు రాజీనామా చేస్తారా? దీంతో సద్దుమణుగుతుందా? అనేది తేలాల్సి ఉంది. కాగా, దీనంతటికీ కారణం సిద్ధరామయ్యేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో సిద్ధరామయ్య అనుచరులుగా పేరుపొందిన వారు ఎక్కువ మంది ఉండటం విశేషం.

మరిన్ని వార్తలు