మహిళల రక్షణ కోసమే దిశ చట్టం: కన్నబాబు

13 Dec, 2019 14:24 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రజలు కోరుకునే తీర్పునే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువస్తున్నారని, అయితే సీఎంకు మంచి పేరు వస్తుందంటే చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారు అని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. దిశ బిల్లుపై  శుక్రవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసమే దిశ చట్టాన్ని తీసుకువస్తున్నామని అన్నారు. ‘దిశ సంఘటన పక్క రాష్ట్రంలో జరిగితే మన రాష్ట్రంలో చట్టం చేస్తున్నాం.

మంత్రివర్గ సహచరులకు కూడా... దిశ ఉదంతంలో అలాంటి తీర్పులు ఇవ్వడం సరికాదని, అయితే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే... నేరం చేసినట్లు ఆధారాలు పక్కాగా ఉంటే 21 రోజుల్లోగా విచారణ పూర్తి చూసి చట్టపరమైన శిక్షలు పడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిర్భయ దోషులకు ఇప్పటివరకూ శిక్ష పడలేదు. వాళ్లు జైలుకు వెళ్లకముందు ఎలా ఉండేవాళ్లు... వెళ్లిన తర్వాత సిక్స్‌ ప్యాక్‌ కండలు పెంచుకుని జైలు నుంచి బయటకు వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే బాధిత కుటుంబాల ఆవేదన చెప్పలేనిది. దమ్మున్న నాయకుడుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చట్టం తీసుకు వస్తుంటే దాన్ని సమర్థిస్తుందో లేదో ప్రతిపక్షం స్పష్టం చేయాలి.

ఇక సోషల్‌ మీడియా వేదికగా  భయంకరమైన కుట్ర జరుగుతుంది. నాయకుల మీదే కాకుండా వారి కుటుంబసభ్యులను కూడా వదిలిపెట్టడం లేదు. మార్ఫింగ్‌ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. భార్యలను, సోదరిలను, తల్లుల్ని అవమానపరుస్తారా? సిగ్గు అనిపించడం లేదా? మహిళలకు గౌరవం వద్దా?  సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌ చేస్తే కఠిన శిక్ష ఉంటుందని, దేశంలో మొట్టమొదటిసారిగా సీఎం జగన్‌ చట్టాన్ని తీసుకు వస్తున్నారు.

‘మహిళలు కనిపిస్తే కడుపైనా చేయాలి..... ముద్దు అయినా పెట్టాలి’ అని సుభాషితాలు చెప్పినవారు ప్రతిపక్ష పార్టీలో శాసనసభ్యులు గా కొనసాగుతున్నారు. వారిని వదిలేసి... మాపై బురద చల్లడం కాదు. చట్టపరంగా  శిక్షిస్తాం కానీ కాల్చి చంపేస్తామా? గొప్ప సంస్కరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రంలో రేప్‌ కేసుల్లో నిందితులు ఎలా ఉన్నారో చూస్తున్నాం. వారిని అతిథిల్లాగా చూస్తున్నారు. నాయ్యం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చర్చను పక్కదారి పట్టించకుండా దిశ చట్టానికి మద్దతు ఇచ్చేలా మాట్లాడాలి’  అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు