సాక్షి, కాకినాడ: చెప్పిన అబద్ధం చెప్పకుండా, మాట్లాడిన మాట మీద నిలబడని వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రపంచం ఓ గ్లోబల్ విలేజ్గా తయారైంది. పోటీని తట్టుకోవాలంటే ఇంగ్లిష్ అవసరం ఉంది. నిన్నటి వరకు ఇంగ్లిష్ మీడియంపై రచ్చ రచ్చ చేసిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. నేనే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలనుకున్నానని అంటున్నారు. చంద్రబాబుని ఏమనాలో అర్థం కావటం లేదు. అసలు తెలుగుపై అంత ప్రేమ ఉంటే తెలుగు అకాడమీ యూనివర్సిటీలను పదో షెడ్యూల్లో ఎందుకు సాధించలేకపోయారు?
టీడీపీ ప్రభుత్వ హయాంలో 6వేల తెలుగు మీడియం పాఠశాలలను మూసేస్తుంటే మీరేం చేశారు? గత ఐదేళ్లలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేకపోయారు? ఐదేళ్లలో నిర్ణయం తీసుకోలేని ఎన్నో విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు నెలల్లో తీసుకున్నారు. ఆర్టీసీ విలీనాన్ని చంద్రబాబు అయితే విస్తృత ప్రచారం చేసుకునేవారు. బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలపై అనర్హత ప్రకటించాలని చంద్రబాబు రాజ్యసభలో ఎందుకు పిటిషన్ వేయలేదు. అక్కడే ఆ ఎంపీలకు చంద్రబాబుకు ఉన్న బంధం ఏంటో అర్థం చేసుకోవచ్చ’ని కన్నబాబు పేర్కొన్నారు.