వైఎస్‌ జగన్‌కు అన్యాయం చేశాను : ఎస్వీ మోహన్‌ రెడ్డి

21 Mar, 2019 18:28 IST|Sakshi

సాక్షి, కర్నూలు : కర్నూలులో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ నేత ఎస్వీ మోహన్‌ రెడ్డి గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోటస్‌ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కండువా కప్పి ఎస్వీని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎస్వీ మోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను బేషరతుగా వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నానని పేర్కొన్నారు. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నేను అన్యాయం చేశా. తప్పు తెలుసుకున్నాను. అందుకే తిరిగి సొంత గూటికి చేరుకున్నా. మోసం చేసే నైజం లేని నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయనను ముఖ్యమంత్రి చేసేందుకు ఉడతా భక్తిగా నా సాయం చేస్తా. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి కృషి చేస్తా. కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్‌లో అన్ని స్థానాల్లో గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని వ్యాఖ్యానించారు.

ఇక టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం వైఎస్సార్ సీపీలో చేరదామన్న తన కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఎస్వీ మోహన్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కర్నూలులో తన సత్తా ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేష్‌ కుటుంబాలకు వ్యతిరేకంగా ఎస్వీ కుటుంబం తరఫున ఢీ కొడతానని అన్నారు. టీడీపీ మోసానికి ప్రతీకారం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు