సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ నయా నవాబ్ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ ధ్వజమెత్తారు. మంగళవారం గాంధీభవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నన్ని రోజులు కనీసం ఒక్క రోజు కూడా సచివాలయానికి రాని కేసీఆర్.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల మధ్యనే ఉంటాననడం హస్యాస్పదంగా ఉందన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే కేసీఆర్ మహిళలకు సీట్లు మాత్రం కేటాయించలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ 11 సీట్లిస్తే.. టీఆర్ఎస్ కేవలం 4 మాత్రమే ఇచ్చిందని, ఒక్కరికి కూడా ఎమ్మెల్సీగా, రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించలేదని మండిపడ్డారు. 14 మంది ఎంపీల్లో ఒకే ఒక మహిళా ఎంపీ ఉన్నారని, ఆమె కూడా కేసీఆర్ కూతురేనన్నారు. మంత్రి వర్గంలో కూడా ఒక్క మహిళకు అవకాశం కల్పించలేదని, మహిళలపై నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మీ పథకం కూడా కేవలం టీఆర్ఎస్ సంబంధిత వర్గాలకే అందుతుందని ఆరోపించారు. ఈ పథకానికి ఇచ్చే నిధులు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించలేదని, ఎక్కడి నుంచి ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు.