సాక్షి, విశాఖపట్నం: రాజధానిని మారుస్తామని మంత్రులెవరూ వ్యాఖ్యలు చెయ్యకపోయినా కొందరు టీడీపీ, బీజేపీ నేతలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అమరావతి నిర్మాణంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో తన బినామీలు, బంధువులకు తక్కువరేట్లకే ముట్టజెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు రాజధానిని దొనకొండకు మారుస్తున్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడుతున్నారని ఆరోపించడం దారుణమన్నారు.
రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని, వికేంద్రీకరణ జరగాలనే ఆలోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారన్నారు. బాబు బినామీలైన కొందరు బీజేపీలో చేరి రాజధాని మారుస్తున్నారనే దుష్ప్రచారాలు పుట్టిస్తున్నారన్నారు. బాబు బినామీలు సుజనాచౌదరి, మురళీమోహన్లతో పాటు అయినవారికి వేల ఎకరాలు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.