మోదీకి డబ్‌స్మాష్‌తో చురకలంటించిన లాలూ ‌!

14 Apr, 2019 17:54 IST|Sakshi

పట్నా: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ డబ్‌స్మాష్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చురకలంటించారు. 2014 ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన హామీలను లాలూ డబ్‌స్మాష్‌ చేశారు. ఈ వీడియోను తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా తెగవైరల్‌ అవుతోంది. 17 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో మోదీ అప్పట్లో ఇచ్చిన పలు హామీలకు లాలూ పెదాలు కదిపారు.

‘దేశంలోని ప్రతి పౌరుడు ఉచితంగా రూ.15 నుంచి 20 లక్షలు పొందుతాడు. సోదర సోదరీమణుల్లారా మంచిరోజులు(‘అచ్చేదిన్’ ) రాబోతున్నాయి.’ అనే వ్యాఖ్యలకు హావభావాలిస్తూ.. లాలూ లిప్‌ సింక్‌ ఇచ్చారు. అయితే ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీసారనేది మాత్రం తెలియరాలేదు. కానీ ఈ వీడియోలో మాత్రం లాలూ బూడిదరంగు టీషర్టు వేసుకుని కనబడుతున్నారు. ఇక ఈ వీడియో క్యాప్షన్‌గా రూ.15 లక్షల వేయడం.. అచ్చేదిన్‌ తీసుకురావడం అనేవి మోదీ ఇచ్చిన ఉత్తహామీలు అని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సైతం ఇదే వ్యాఖ్యలతో పలుమార్లు నరేంద్రమోదీని టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. కానీ లాలూలా మాత్రం వినూత్నంగా మోదీకి చురకలంటించింది ఎవరు లేరని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది.

>
మరిన్ని వార్తలు