శేరిలింగపల్లిలో టీడీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల బాహాబాహీ

28 Nov, 2018 11:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శేరిలింగపల్లిలో నియోజకవర్గంలో టీడీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్‌ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. శేరిలింగపల్లిలోని ఆల్విన్‌ సొసైటీ కార్యాలయంలో బుధవారం ఉదయం కొందరు టీడీపీ నాయకులు అల్పహార విందు ఏర్పాటు చేశారు. టీడీపీ విందు కార‍్యక్రమం గురించి తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.

టీడీపీ ఎన్నికల నియమావళిని ఉల్లఘింస్తుందని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆల్విన్‌ సొసైటీ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఆల్విన్‌ సొసైటీ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.  కాగా, ఈ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున అరికెపూడి గాంధీ, టీడీపీ నుంచి వెనిగళ్ల ఆనంద్‌ప్రసాద్‌ బరిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు