ప్రగతి నివేదన కాదు... కేసీఆర్‌ ఆవేదన

4 Sep, 2018 02:06 IST|Sakshi

టీఆర్‌ఎస్‌పై మండిపడిన కె.లక్ష్మణ్‌

వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే సభ

సీఎం కేసీఆర్‌ ప్రసంగంలో దశా దిశా లేదు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రగతి నివేదన సభ నిర్వహించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. గత పది రోజులుగా రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి భారీ ప్రచారం చేసి నా ఫలితం లేకపోయిందని విమర్శించారు.

బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభ కాస్త కేసీఆర్‌ ఆవేదన సభగా మారిందని, సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని చెప్పారు. ఎన్నికల శంఖారావంలా, తన కుమారుడికి పట్టాభిషేకం చేయాలని సీఎం కేసీఆర్‌ రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహించారని.. అది కాస్త ప్రజల ఆదరణ పొందని సభగా మిగిలిపోయిందని విమర్శించారు. ధనబలం, అధికారమదంతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జనాలను తరలించేందుకు వందల కోట్లు ఖర్చు పెట్టినా.. ప్రజలను సమీకరించలేకపోయారన్నారు.

టీఆర్‌ఎస్‌ తొత్తులుగా అధికారులు..
ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చకపోగా రాష్ట్రా న్ని టీఆర్‌ఎస్‌ అప్పులోకి నెట్టిందని లక్ష్మణ్‌ ఆరోపించారు. తాము ఫ్లెక్సీలు కడితే రాత్రికి రాత్రే తొలగించే జీహెచ్‌ఎంసీ అధికారులు, ఇప్పుడెందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారా రని మండిపడ్డారు. తమ అధినేత అమిత్‌షా కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారని, ప్రచారం కూడా చేస్తానని చెప్పారని తెలిపారు.

ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ప్రజల అభిమానం లేకపోతే ఏమవుతుందో ప్రగతి నివేదన సభతో తేటతెల్లమైందని చెప్పారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఉద్యోగాలు, ఎస్టీలకు రిజర్వేషన్లపై సభలో కేసీఆర్‌ ఎందుకు ప్రస్తావించలేదన్నారు. ఆయన ప్రసంగం మొత్తం అబద్ధాలు, అసత్యాలేనన్నారు. కేసీఆర్‌ ప్రసంగానికి ఒక దశా దిశా లేదని విమర్శించారు.

ట్విట్టర్‌లో స్పందించినంత సులువు కాదు..
బహిరంగ సభలను నిర్వహించడమంటే ట్విట్టర్‌లో స్పందిం చినంత సులువు కాదని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. కుటుంబ పెత్తనం, అవినీతి సొమ్ముతో ప్రజల ను మభ్యపెట్టలేరని తేలిందని చెప్పారు. ఈ సభకు 3 లక్షల మంది కూడా రాలేదన్నారు. ముందస్తుతో టీఆర్‌ఎస్‌కు పరాభవం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టు కొని ప్రధాని నరేంద్ర మోదీ జోనల్‌ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ఆమోదిస్తే.. ప్రధానిని ఉద్దేశించి చులకనగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఎస్సీ వర్గీకరణ, హైకోర్టు విభజనను ఎందుకు సాధించలేక పోయారని లక్ష్మణ్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు