సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ను ఒంటరిగా ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్కు లేదని, అందుకే మహాకూటమి ఏర్పాటుకు వెంపర్లాడుతోం దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. అది మహాకూటమి కాదని, అదొక విష, విచిత్ర, విఫల కూటమి అని మండిపడ్డారు. గజ్వేల్ నియోజకర్గానికి చెందిన అడ్వొకేట్లు శ్రీనివాస్, రవీందర్రెడ్డి తదితరులు సోమవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 రోజులు కష్టపడితే అధికారం తమదేనని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. హరీశ్రావు వ్యాఖ్యలు ఉద్వేగంతో కూడుకున్నాయి అని అంటున్నా.. అవి ఉద్వేగంతోనా లేదా ఉద్దేశ పూర్వకంగానా అనేది ప్రజలు ఆ మాత్రం అర్థం చేసుకోలేని అమాయకులు కాదన్నారు. భవిష్యత్లో టీఆర్ఎస్ నిట్టనిలువునా చీలిపోవడం ఖాయ మన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ ను ప్రజలు చిత్తుగా ఓడిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఈ సారి బీజేపీకి పట్టం కట్టడం ఖాయమన్నారు.