కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు..!!

15 Nov, 2018 17:24 IST|Sakshi

మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల రాజీనామా

నిజామాబాద్‌ కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

సాక్షి, నిర్మల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డ అసంతృప్త నేతలు తమ భవిష్యత్‌ కార్యాచరణకు సిద్దమయ్యారు. కొందరు ఆయా పార్టీలకు రాజీనామా చేయగా... మరికొందరు రెబెల్స్‌గా ఎన్నికల బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామాలు చేయగా.. తాజాగా నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌లో కూడా టికెట్ల లొల్లి మొదలైంది. ముధోల్‌ నియోజకవర్గ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌కు టికెట్‌ రాకపోవడంతో ఆయన గురువారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. జాతీయ పార్టీ ఎన్సీపీ నుంచి  ఆయన ముధోల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నారని సమాచారం.

అరుణతార కాంగ్రెస్‌కు రాంరాం
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ తార కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బిచ్కుంద మండల కేంద్రం నుంచి గాంధీ భవన్‌కు ఆమె ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తొమ్మిదేళ్లు పార్టీ కోసం శ్రమిస్తే పార్టీ పట్టించుకోలేదనీ,  టికెట్ ఇవ్వకపోవడంతోనే కాంగ్రెస్‌ను వీడుతున్నానని ప్రకటించారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి వచ్చిన తనకు మొదట టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పెద్దలు చెప్పారని, అనంతరం మొండిచేయి చూపారని అరుణ వాపోయారు. మరో నాలుగు రోజుల్లో అభిమానులు, అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

మరిన్ని వార్తలు