ఐదు నియోజకవర్గాల్లో రెండుసార్లు విజయం
మూడోసారీ సత్తా చాటేందుకు తహతహ
వ్యూహ రచనలో మునిగిన అభ్యర్థులు
ప్రత్యర్థులను చిత్తు చేసే దిశగా పావులు
ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారాస్త్రాలు
కుత్బుల్లాపూర్: నగరంలోని ఆ ఐదు నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు అభ్యర్థులు ప్రచారాస్త్రాలకు పదును పెట్టుకుంటున్నారు. మూడోసారి విజయానికి ఉవ్విళ్లూరుతున్నారు. 2009లో, 2014, ఎన్నికల్లో విజయతీరాలకు చేరి ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించేందుకు వ్యూహ రచనలు సిద్ధం చేసుకుంటున్నారు. నగరంలో 23 నియోజకవర్గాల్లో ఉన్నాయి. వీటిలో 5 నియోజకవర్గాల అభ్యర్థులు వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి ప్రకాశ్గౌడ్ (టీఆర్ఎస్), అంబర్పేట్ నుంచి జి.కిషన్రెడ్డి (బీజేపీ), మలక్పేట్ నుంచి మహ్మద్ బీన్ అబ్దుల్ బలాల, చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ, బహదూర్పురా నుంచి మోజంఖాన్ (ఎంఐఎం)లు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించడానికి సన్నద్ధమవుతున్నారు.
గెలుపే కాదు..ఓటు బ్యాంకు కూడా..
ఈ 5 నియోజకవర్గాల్లోని అభ్యర్థులు 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించడమే కాకుండా ఎక్కువ మొత్తంలో ఓటు బ్యాంకును పెంచుకుంటూ వస్తున్నారు. 2009లో కన్నా 2014 ఎన్నికల్లో అభ్యర్థులంతా గతంలో సాధించిన దానికంటే గణనీయమైన ఓట్లు తెచ్చుకోవడంగమనార్హం.