కన్హయ్య.. ఆ నినాదం ఇచ్చావా.. చెప్పు?

17 Apr, 2019 16:53 IST|Sakshi
కన్హయ్య కుమార్‌

కాన్వయ్‌ను అడ్డుకొని ఘోరవ్‌ చేసిన స్థానికులు

పట్నా : జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ యువనేత కన్హయ్య కుమార్‌ కాన్వయ్‌ని బేగూసరాయి స్థానికులు అడ్డుకున్నారు. ‘భారత్‌కే తుక్డే..తుక్డే’ అంటూ ఇచ్చిన నినాదంపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అతన్ని ఘోరవ్‌ చేశారు. 2016లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న కన్హయ్య కుమార్‌..  దేశ సమగ్రతను దెబ్బతినే విధంగా నినాదాలు చేశారన్న ఆరోపణలతో అతనిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కన్హయ్య వీటిని గట్టిగా ఖండించారు.

వామపక్ష సిద్ధాంతాలను, దళితులకు అంబేడ్కర్‌ కల్పించిన రక్షణ కవచాన్ని కలగలిపి ‘లాల్‌.. నీల్‌’ అనే ఒక కొత్త రాజకీయ అస్త్రాన్ని సంధించి అందరి దృష్టిని ఆకర్షించిన కన్హయ్య కుమార్‌.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బేగూసరాయి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించగా స్థానికులు కొంతమంది అడ్డుకున్నారు. ఏరకమైన స్వేచ్ఛ కావాలంటూ నిలదీశారు. రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు వచ్చిన ఆరోపణల సంగతేంటని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పని కన్హయ్య కుమార్‌.. బీజేపీ మద్దతుదారులా అంటూ ఎదురు ప్రశ్నించారని స్థానికులు మీడియాతో వాపోయారు.

మరిన్ని వార్తలు