కమలం పొత్తు వికసిస్తుందా.. వికటిస్తుందా?

23 Oct, 2018 11:21 IST|Sakshi
నితీష్‌ కుమార్‌-అమత్‌ షా (ఫైల్‌ ఫోటో)

బీజేపీ 17, జేడీయూ 16 స్థానాల్లో పోటీ

లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌లో సీట్ల పంపకం

పట్నా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ పొత్తులపై దూకుడుపెంచింది. దానిలో భాగంగానే ఉత్తర భారతంలో కమలానికి ఎంతో కీలమైన బిహార్‌లో నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని జేడీయూతో జతకట్టింది. గత కొంతకాలంగా జేడీయూ-బీజేపీల మధ్య సీట్ల పంపకంపై ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. దానికి చెక్‌ పెడుతూ లోక్‌సభ సీట్ల విషయంలో రెండు పార్టీలు ఏకభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 17, జేడీయూ 16 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై రెండు పార్టీలు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది

బీజేపీ మిత్రపక్షమైన లోక్‌ జనశక్తి పార్టీకి ఐదు, ఉపేందర్‌ కుషావా పార్టీకి రెండు సీట్లు కేటాయించినట్లు సమాచారం. సీట్ల పంపకాలపై బీజేపీలోని ఓ వర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. జేడీయూతో పొత్తు వల్ల సిట్టింగ్‌ స్థానాలకు కూడా కోల్పోవాల్సి వస్తుందని ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము అశించిన స్థానాలు దక్కని పక్షంలో పొత్తు కుదరని జేడీయూ నేతలు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెండు పార్టీలు ఏ విధంగా ఎన్నికల్లో కలిసి పనిచేస్తాయో వేచి చూడాలి.

సీట్ల పంపకాలపై గత కొంతకాలంగా రెండు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు చేటుసుకున్నాయి. గత ఎన్నికల్లో విజయం సాధించిన అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించగా.. దానికి నితీష్‌ తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. సీట్ల పంపకాలపై నితీష్‌, అమిత్‌ షాలు ఇదివరికే పలు దఫాలు చర్చించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 22 స్థానాల్లో గెలుపొందగా మిత్ర పక్షాలతో కలుపుకుని 35 స్థానాలకు పైగా సొంతం చేసుకుంది. కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలతో జట్టు కట్టిన జేడీయూ కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. 

మరిన్ని వార్తలు