కర్ణాటకలో బీఎస్పీ మంత్రి రాజీనామా

12 Oct, 2018 04:06 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న బీఎస్పీ నేత మహేశ్‌ గురువారం తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీని పటిష్టం చేసేందుకు వీలుగానే ముఖ్యమంత్రి కుమారస్వామికి రాజీనామా సమర్పించినట్లు మహేశ్‌ మీడియాకు తెలిపారు. మంత్రిగా తాను బెంగళూరుకు పరిమితమైనందున సొంత నియోజకవర్గం కొల్లెగల్‌లో తనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని వెల్లడించారు. కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. వచ్చే నెల 3న మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి తరఫున ప్రచారంలో పాల్గొంటానని పేర్కొన్నారు. పూర్తి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా సమర్పించానని పునరుద్ఘాటించారు. 

మరిన్ని వార్తలు