ఏపీని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది: చంద్రబాబు

22 Mar, 2018 10:09 IST|Sakshi
టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోన్న చంద్రబాబు( పాత చిత్రం)

అమరావతి : పార్లమెంటు, అసెంబ్లీ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీపి ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘ అవిశ్వాసం చేపట్టకుండా కేంద్రం పదేపదే కావాలనే వాయిదాలు వేస్తోంది. కేంద్రం ప్రవర్తన కొంతకాలంగా భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. రాష్ట్రానికి న్యాయం చేయాలని వారికి ఏ కోశానాలేదు. గతంలో ప్రత్యేక ఆర్ధిక సహాయానికి ఎందుకు ఒప్పుకున్నాం,ఇప్పుడెందుకు హోదాయే కావాలని అడుగుతున్నాం అనే దానిపై ప్రజలకు వివరించాలి. ఎవరికీ హోదా ఇవ్వం అంటేనే అప్పుడు ఆర్ధిక సహాయానికి అంగీకరించాం. తరువాత కేంద్రం మాట తప్పింది. హోదా రాష్ట్రాలకు 90:10 కింద నిధులు, ప్రోత్సాహకాలు కొనసాగిస్తోంది. వేరే రాష్ట్రాలకు ఇచ్చేటట్లయితే మనకూ అదేపేరుతో ఇవ్వాలనేది మన డిమాండ్ ’  అని స్పష్టం చేశారు.
 
కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. అందుకే టీడీపీకి మద్దతుగా అన్నివర్గాల ప్రజలు ఉన్నారని, తొలి ఏడాది నుంచే గొడవలు పెట్టుకుంటే రాష్ట్రం దెబ్బతింటుందని, అందుకే ఇన్నాళ్లూ ఓపికపట్టామని వివరించారు.రాష్ట్రానికి నిధులివ్వమని కోరితే తనపై కేంద్రం ఎదురుదాడి చేయిస్తోందని మొసలి కన్నీరు పెట్టారు.

మూడు పార్టీలు కలిసి తనపై ముప్పేట దాడి చేస్తున్నారని విమర్శించారు. అయినా వెనుకంజ వేసేది ప్రసక్తే లేదని,రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడేది లేదన్నారు. ప్రజలే మాకు కొండంత అండ  అని, తనను,లోకేష్‌ను, మంత్రులను, టీడీపీని టార్గెట్ చేస్తున్నారనిఆరోపించారు. కక్ష సాధింపు చర్యలు ఇంకా పెరుగుతాయని, టీడీపీ నాయకులు, కార్యాకర్తలందరూ సిధ్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు