'ప్రామిస్‌.. ఇక కొత్త కాంగ్రెస్‌ను చూస్తారు'

9 Jan, 2018 09:42 IST|Sakshi

మనామా : గతంలో తమ పార్టీలో కొన్ని తప్పిదాలు జరిగాయని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తాను కూడా కొన్ని తప్పులు చేసినట్లు చెప్పారు. తాను కూడా అందరిలాగే మనిషినని, అప్పుడప్పుడు తప్పులు చేయడం సహజమేనన్న ఆయన భవిష్యత్‌లో మాత్రం అలాంటివి జరగబోవని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో కూడా తప్పులు జరగకుండా చూస్తానని, మున్మందు అందరు కొత్త కాంగ్రెస్‌ పార్టీని చూస్తారని, ఈ విషయంలో హామీ ఇస్తున్నానని చెప్పారు. గొప్ప దార్శనీకతతో ఉండే కాంగ్రెస్‌ను అంతా చూస్తారని చెప్పారు.

'కాంగ్రెస్‌ పార్టీ తన తప్పులను అంగీకరించిందని మీరు చెప్పారు. అలాగే నేను కూడా ఓ మనిషినే కాబట్టి తప్పు చేసినట్లు ఈ సందర్భంగా చెబుతున్నాను. మనందరం మనుషులం కాబట్టి తప్పులు చేస్తుంటాం. మీరు కొంత గ్యాంప్‌ ఉందని అన్నారు. ఆ గ్యాప్‌ ఉన్నది మీడియాలో మాత్రమే. మీడియాలో ఒకవైపు ప్రచారం మాత్రమే జరుగుతోంది. గుజరాత్‌లో బీజేపీ గతంలో ఎంత బలంగా ఉందో మీ అందరికీ తెలుసు. కానీ, ఈసారి ఆ పార్టీ విజయాన్ని అందుకునేందుకు ముప్పుతిప్పలుపడి అపజయం నుంచి బయటపడింది. కాంగ్రెస్‌ పార్టీ వారిని అక్కడ ప్రశ్నించింది.

భారత్‌కు ఓ కొత్త దార్శనీకతను ఇవ్వాలని అనుకుంటున్నాం. ప్రజలకు ఓ కొత్త కాంగ్రెస్‌ పార్టీని ఇవ్వాలని భావిస్తున్నాను. కొత్త కాంగ్రెస్‌ పార్టీని మీకు మీరు ఇచ్చుకుంటే బీజేపీని ఓడించడం పెద్ద కష్టమేం కాదు. గతంలో మనం ఎన్నో తప్పిదాలు చేశాం. పార్టీని బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు దేశ జీడీపీ 2శాతం పడిపోయినట్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో గొప్ప అనుభవం కలిగిన వారు, అదే స్థాయిలో యువత కూడా ఉంది. ఇది మంచి విషయం. మీరు ఊహించని విధంగా నాటకీయ ఫక్కీలో కాంగ్రెస్‌ పార్టీ మార్పులు కచ్చితంగా చూస్తారు' అని రాహుల్‌ గాంధీ బహ్రెయిన్‌లో ఎన్‌ఆర్‌ఐలతో భేటీ అయిన సందర్భంగా చెప్పారు.

మరిన్ని వార్తలు