‘ఆంధ్రోళ్లతో నువ్వు వ్యాపారాలు చేయడం లేదా’

2 Oct, 2018 15:37 IST|Sakshi

కేటీఆర్‌పై మధుయాష్కీ ఫైర్‌

నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి పోటీచేస్తానని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌, టీడీపీల పొత్తుపై విమర్శలు చేస్తున్న కేటీఆర్‌పై ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ ధ్వజమెత్తారు. కేటీఆర్‌ ఆంధ్రావాళ్లతో వ్యాపారం చేస్తే తప్పులేదు గానీ తాము టీడీపీతో పొత్తుపెట్టుకుంటే తప్పా అని ప్రశ్నించారు. వెంక​య్యనాయుడు కొడుకు వ్యాపారాలలో కేటీఆర్‌ భాగస్వామిగా ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కేసీఆర్‌ 9 నెలల ముందే అసెంబ్లీని రద్దుచేసి తన అసమర్థతను చాటుకున్నారని ఎద్దేవా చేశారు.

వందల కోట్ల రూపాయలతో టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు విలాసవంతమైన ఇళ్లు కుట్టుకున్నారనీ, పేదలకు ఇస్తామన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు మాత్రం స్థలం దొరకడం లేదా అని విమర్శలు గుప్పించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎంపీ స్థానం నుంచి పోటీచేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో  కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ కుటుంబానికి గల ఆస్తులను బయటపెడతామని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు